పదవీ విరమణ పొందిన ఒక ఉద్యోగి ప్రశాంతత కోసం ఓ ఆధ్యాత్మిక గురువును కలిశాడు. ‘నీకున్న సమస్యలేంటి?’ అని అడిగాడు ఆ ఆధ్యాత్మికవేత్త. ‘పిల్లల భవిష్యత్తు పట్ల, తన ఆరోగ్యం పట్ల విపరీతమైన వ్యతిరేక ఆలోచనలు వస్తున్నాయ’ని వాపోయాడు ఆ పెద్దాయన. ‘ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు?’ ప్రశ్నించాడు గురువు. ‘మా డాబా మీద పావురాలు ఉన్నాయి. వాటికి చిరుధాన్యాలు పెడుతుంటాను. నీళ్లు ఉంచుతుంటాను’ అని బదులిచ్చాడు. ‘అప్పుడవి ఆకాశానికి ఎగిరి.. మళ్లీ నీ దగ్గరికి వస్తుంటాయా?’ అని అడిగాడు గురువు. అతను అవునన్నాడు.
‘మీరు పావురాలను పెంచి పోషిస్తున్నారు కాబట్టి అవి ఎక్కడికీ పోవడం లేదు. ఎక్కడికి ఎగిరినా మళ్లీ మిమ్మల్ని చేరుతున్నాయి. దారివెంట వాహనాల్లా.. మన మనసులో ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. మనం వేటికి ప్రాధాన్యమిస్తామో, వేటిని పెంచి పోషిస్తామో అవి మనల్ని వీడవు. ఎంత వద్దనుకున్నా.. వెంటే ఉంటాయి. వెంటాడుతాయి. చింతించి సమస్యల్ని పరిష్కరించుకున్న వాళ్లెవరూ మనకు కనిపించరు. అతిగా ఆలోచించి ఆలోచించి శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్నవాళ్లు మాత్రం చాలామంది కనిపిస్తారు. అందుకే విషయాలపై కాకుండా, మనం ఆధ్యాత్మిక చింతన చేయాలి. ఫలితంగా జీవితంపై అవగాహనా సామర్థ్యం పెరుగుతుంది. మనల్ని మనం మార్చుకోగలం. సమస్యల్ని ఎదుర్కోగలం.
ఇందుకోసం మనం చేయాల్సింది సత్సంగం. అప్పుడు మంచి ఆలోచనల బీజాలు మన మనోక్షేత్రంలో నాటుకుంటాయి. బీజాలు మొక్కలు కావడానికి కొంచెం నీళ్లు, వెలుతురు లాంటివి అవసరం. అలాగే మనం ఆధ్యాత్మికత వైపు నడవటానికి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, భక్తి సంగీతం వినడం, పుణ్య క్షేత్రాలు సందర్శించడం చేయాలి. ఆశ్చర్యం ఏమిటంటే సత్సంగం వైపు మనం ఒక్క అడుగు ముందుకేస్తే, అది నాలుగు అడుగులు ముందుకు నడిపిస్తుంది’ అని గురువు సలహా ఇచ్చాడు. ‘పోయాక చితి చేరక తప్పదు. బతికుండగానే కాల్చే చింత ఎందుకు?’ అని అర్థం చేసుకున్న ఆ పెద్దాయనకు మనసు స్థిమితమైంది.