బిలాల్ హబషీ పొట్టి నీగ్రో జాతి బానిస. ఒకానొక ఖర్జూరపు తోటలో రాలిన ఖర్జూరాలు ఏరుకోసాగాడు. వాటిని జోలెలో నింపుకొని అమ్ముకునేందుకు బస్తీ బాట పట్టాడు. ‘తాజా ఖర్జూరాలు’ అని అరుస్తూ కొనుగోలుదారులను పిలవసాగాడు. కానీ, వాటిని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అంతలోనే ఒక పిలుపు వినిపించింది. ‘ఓ హబషీ ఈ ఖర్జూరాలు కూడా నీలాగనే నల్లగా ఉన్నాయి’ అని హేళన చేస్తూ మాట్లాడాడు ఓ వ్యక్తి. ఈ మాటలకు బిలాల్ హబషీ చిన్నబుచ్చుకున్నాడు. కళ్లలో నీళ్లు ధారాపాతంగా వర్షించాయి. ఖర్జూరాల మూటను కింద పడేసి కూలబడిపోయాడు. అంతలోనే అటుగా వచ్చిన ఆదర్శ ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సఅస) బానిస బిలాల్ పరిస్థితిని చూసి చలించిపోయారు. ‘అయ్యో ఎందుకేడుస్తున్నావు నాయనా’ అని ఓదార్చే ప్రయత్నం చేశారు.
జరిగిన ఉదంతాన్ని వివరించాడు బిలాల్. కాస్తంత ముందుకెళ్లి బిగ్గరగా కేక వేస్తూ ‘ఇక్కడ అజ్వా ఖర్జూరాలు అమ్మకానికి ఉన్నాయి. ఈ పండు ఎన్నో రోగాలకు ఉపశమనం. గుండె, పక్షవాతం, ఇలా 70 రకాల రోగాలకు ఇందులో ఉపశమనం ఉంది’ అని పిలవసాగారు. అప్పటివరకూ నిరాశతో కుంగిపోయిన బిలాల్ ముఖ కవళికలన్నీ మారిపోయాయి. జనాలు ఖర్జూరాలు కొనడానికి ఎగబడ్డారు. బిలాల్కు ఆ రోజు కాసుల వర్షం కురిసింది. అలా అజ్వా ఖర్జూరం.. ఖర్జూర జాతులకు రారాజుగా వినుతికెక్కింది.
…? ముహమ్మద్ ముజాహిద్
96406 22076