స్త్రీ అంటే శక్తి. స్త్రీ శక్తి లేనిదే హరిహర బ్రహ్మాదులు కూడా ఏమీ చేయలేరు. మూలమైన పరాశక్తే ముగ్గురమ్మలుగా మారి త్రిమూర్తులకు శక్తినిచ్చింది. బ్రహ్మ సృష్టి చేయాలంటే శక్తి అవసరం. అవిద్య నుంచి విద్యా స్వరూపాన్ని ఇవ్వడానికి బ్రహ్మకు సరస్వతి చేదోడువాదోడుగా ఉంటుంది. స్థితి కల్పించే విష్ణువుకు సంపద కావాలి. ఆ సంపద స్వరూపమే లక్ష్మీదేవి. సంహారం అంటే నాశనం కాదు. మూసివేయడమని అర్థం. ప్రపంచాన్నంతా దగ్గరికి తీసుకొని ఒక పదార్థంగా మార్చడానికి రుద్రుడికి పార్వతీదేవి శక్తి స్వరూపిణిగా తోడ్పడింది.
భగవంతుడు ఒక అవతారాన్ని దాల్చి భూమ్మీద అడుగుపెట్టినప్పుడు శక్తి స్వరూపం కూడా ఆయన వెంట కదలివస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ శక్తి లేనిదే అతనికి పూర్ణత్వం ఉండదు. ఆమె పక్కన ఉంటేనే ఆ అవతార ప్రయోజనం పూర్తవుతుంది. శక్తి సహితుడు కానప్పుడు పరిపూర్ణతతోపాటు ఉపాసనా శక్తి కూడా ఉండదు. సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు ఇలా శక్తితో కూడి భగవంతుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆమె శక్తి మాత్రమే కాదు దయాశాలి, అపార కారుణ్యమూర్తి. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని గుండెల్లో స్థానం అడిగింది ఎందుకంటే, భక్తులు చేసే కర్మలకు ఫలితాన్నిచ్చేటప్పుడు, తన భర్తను హృదయంతో ఆలోచించి బిడ్డల తప్పులను మన్నించి ఉద్ధరించమని ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకే!
పలు పౌరాణిక పాత్రలు కూడా స్త్రీ ఔన్నత్యాన్ని చాటిచెప్తాయి. ధర్మరాజులా శకుంతల కూడా యుధిష్ఠిరి. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నది.
తనను అన్యాయం చేసిన దుష్యంతుడిని ‘అబద్ధాల కోరు’ అని విమర్శించిందే కానీ, తనను ఏలుకోమని, లేకపోతే అనాథను అయిపోతానని సాగిల పడలేదు. భారతీయ స్త్రీ గొప్పదనాన్ని తనద్వారా లోకానికి చాటిచెప్పింది. రాముడితోపాటు లక్ష్మణుడు అడవికి వెళ్తానంటే సుమిత్ర మనస్ఫూర్తిగా అంగీకరించింది. కైకేయి తన కొడుకు భరతుడు పట్టాభిషిక్తుడు కావడానికి రాముణ్ని అడవికి పంపితే, సుమిత్ర లక్ష్మణుడిని రాముడి వెంట నడవమంది. త్యాగశీలతకు ఉదాహరణగా నిలిచిందామె. అందుకే, రామాయణంలో సుమిత్ర వంటి పాత్ర లేదంటాడు వాల్మీకి.
‘తెల్లవారితే నీ భర్త మరణిస్తాడ’ని విన్న మహా ఇల్లాలు సుమతి తన పాతివ్రత్య మహిమతో సూర్యోదయాన్ని శాసించి నిలుపుదల చేసింది. మహా భారతంలో గాంధారి సంతానాపేక్షతో చిన్నతనంలోనే శివుడి గురించి తపస్సు చేసి ఎక్కువమంది పిల్లలకు తల్లి కావాలనే వరాన్ని పొందింది. కురు వంశాన్ని నిలబెట్టే ఉద్దేశంతో భీష్ముడు గాంధారిని ధృతరాష్ర్టుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అదే విషయం గాంధారి పెద్దల దగ్గర ప్రస్తావిస్తాడు. ఆమె ఎంతో ఔదార్యంతో తనవల్ల కురువంశం నిలబడితే, అంధుడైనవాడు బిడ్డలను పొందానని సంతోషిస్తే అంతకన్నా జన్మకు సార్థకత మరేదీ లేదని ధృతరాష్ర్టుడితో పెండ్లికి అంగీకరించింది. అంతేకాదు, తన భర్త చూడలేని ప్రపంచం తనకూ అవసరం లేదని కండ్లకు వస్త్రం కట్టుకుంది.
ధృతరాష్ర్టుడు పుత్ర వాత్సల్యంతో ధర్మం తప్పి రాజ్యాన్ని తన కొడుకులకు ఇవ్వడాన్ని గాంధారి తీవ్రంగా తిరస్కరించింది. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దుర్యోధనుడు తల్లికి నమస్కరించి దీవించమనగా.. ‘ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. నీకు విజయం కలగాలంటే ధర్మాన్ని ఆశ్రయించమ’ని చెప్పింది. ఇక కుంతీదేవి జీవితాన్ని పరికిస్తే ఆమె పడిన కష్టనష్టాలు, వాటిని ఓర్పుతో ఆమె అనుభవించిన తీరు.. ఈ లక్షణాలన్నీ భారతీయ స్త్రీలకు పుట్టుకతోనే సంక్రమించాయా అనిపిస్తుంటుంది. ఇందరు పతివ్రతలను కలిగి ఉండటం మన జాతి గొప్పదనం. అలాంటి మహిళలకు వారసులైన స్త్రీ మూర్తులను సదా గౌరవిద్దాం. స-కారం సత్తగుణం, ర-కారం రజోగుణం, త-కారం తమోగుణం కలగలిసిన త్రిగుణాత్మకమైన ప్రకృతికి ప్రతీక స్త్రీ. ప్రకృతి మాతలోని దైవత్వాన్ని స్త్రీలో చూడగలిగినప్పుడు దేవతలు హర్షిస్తారు. మహిళలను గౌరవించడమే మానవజాతికి శ్రీరామరక్ష.