దుర్గాదేవి మహిషాసురుణ్ని వధించిన ఘట్టానికి గుర్తుగా దసరా జరుపుకొంటున్నారు. అయితే కర్ణాటకలోని కొన్ని తెగల్లో మహిషాసురుడు అంటే గౌరవభావం ఉంది. మైసూరు దగ్గర్లో చాముండి హిల్స్ ఉంటుంది. ఆ కొండ మీద ఒకచేతిలో కత్తి, మరోచేతిలో నాగుపాము పట్టుకుని నిల్చున్న మహిషాసురుడి భారీ విగ్రహం ఉంటుంది.
అసలు మైసూరు అనే పదం మహిషూరు… లేదా మహిషాసురుని ఊరు అనే పదం నుంచి వచ్చిందని అంటారు. దేవీ పురాణంలో కూడా మైసూరు ప్రాంతం మహిషాసురుడి రాజ్యంగా పేర్కొన్నారు. దేవతలను, దేవుళ్లను రక్షించడానికి దుర్గాదేవి చాముండేశ్వరిగా అవతరించి దుష్టుడైన మహిషాసురుణ్ని సంహరించిందని కథ. కానీ, స్థానికులు మాత్రం మహిషుణ్ని మంచి పాలకుడిగా విశ్వసిస్తారు.