సముద్రంలో చేపల వేట కోసం ఓ జాలరి పడవలో బయల్దేరాడు. అతని వెంట పదహారేండ్ల కొడుకూ వెళ్లాడు. దగ్గరలో చేపలు దొరక్కపోవడంతో సముద్రంలో చాలా దూరం వెళ్లారు. సమీపంలో చిన్నదీవి కనిపించడంతో విశ్రాంతి తీసుకుందామని తీరానికి చేరుకున్నారు. అక్కడ సమీపంలో ఇద్దరు విదేశీయులు ఇసుక తిన్నెలపై పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు.
‘జీవితం అంటే వీళ్లదే! విహారం కోసం ఎక్కడి నుంచో ఇంత దూరం వచ్చారు’ అనుకున్నాడు జాలరి కొడుకు. వారిని ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన ఒక విదేశీయుడు.. అతణ్ని దగ్గరికి రమ్మని పిలిచాడు. వాళ్ల దగ్గరున్న బాదం పప్పు ఇచ్చాడు. వాటిని తీసుకుంటూ ‘మీరు ఎంత అదృష్టవంతులు.. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు’ అన్నాడు జాలరి కొడుకు. దానికి విదేశీయుడు చిన్నగా నవ్వి ‘నీకలా అర్థమయ్యిందా! మా దేశాలలో చలి ఎక్కువ.
సూర్యుడు కొంత సమయమే ఉంటాడు. సరిపడా సూర్యరశ్మి సోకకపోవడంతో.. మాలో చాలామంది ఎముకలు, కండరాలు, చర్మ సంబంధిత సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి రుగ్మతల బారినపడకుండా శరీరానికి సరిపడా సూర్యరశ్మి కోసం ఇలా ఉష్ణమండలాల విహారానికి వస్తుంటాం. ‘ఎండలు మెండుగా ఉండే ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎంత అదృష్టవంతులో’ అని భావిస్తుంటాం’ అన్నాడు విదేశీయుడు. ఆ సమాధానం విని జాలరి కొడుకు ఆశ్చర్యపోయాడు. ‘ఒడ్డున ఉన్నవారు నీళ్లలో ఉన్నవారు ఆనందంగా ఉన్నారని, నీళ్లలో ఉన్నవారు ఒడ్డున ఉన్నవాళ్లు అదృష్టవంతులని భావించడం మానవ నైజం’ అని అతనికి అర్థమైంది. ‘పీత కష్టాలు పీతవి’ అనుకుంటూ చేపల వేట కోసం తండ్రితో కలిసి సముద్రంలోకి వెళ్లాడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 9393662821