Yadadri Laxmi narasimha Swamy |అవతరణ అంటే దిగి రావటం, వచ్చి కంటికి కనబడటం. కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తమై ఒక రూపాన్ని ధరించి, అధర్మాన్ని అణచి, ధర్మ పరిరక్షణ చేయటమే ఏ అవతారి లక్ష్యమైనా. యుగయుగాలుగా సంభవిస్తున్న ఈ క్రీడ, భారతదేశ సంస్కృతిలో సింహభాగం! అందునా తెలుగునాడు, నృసింహ అవతారం పరచుకున్న దివ్య క్షేత్రం. అహోబిలం, పెంచలకోన, మంగళగిరి, వేదాద్రి, సింహాచలం, యాదాద్రి.. పరమ పవిత్ర నృసింహ శక్తి క్షేత్రాలు. అవి తాత్త్విక చింతనా భూమికలు!
ప్రహ్లాద చరిత్రను శాశ్వతం చేసిన నృసింహ ఆవిర్భావంలో ఎన్నో తాత్త్విక కోణాలు దాగి ఉన్నాయి. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడితో సాగించిన వాదం అంతా, భగవంతుని అస్తిత్వం చుట్టూ జరిగిన తీవ్ర చర్చ.
హిరణ్యకశిపుడిది సంశయాత్మకమైన వైరభక్తి! ప్రహ్లాదుడిది నమ్మకంతో నిండిన మధురభక్తి!
మార్గాలు వేరు. కానీ గమ్యం ఒక్కటే అది దైవం ఉనికిని నిరూపించటం. లేడులేడన్న హిరణ్యకశిపుడి కోసమూ, అంతటా ఉన్నాడన్న ప్రహ్లాదుడి నమ్మకాన్ని నిలబెట్టడం కోసమూ, చిచ్ఛక్తి ఎంచుకున్న రూపం భయదం! అదే నరసింహ స్వరూపం.
జీవుడు కోరినదల్లా దైవం ఇవ్వడు. జీవుడి అర్హతను బట్టి, అవసరాన్ని బట్టి దైవమే వరదానం చేస్తాడు.
హిరణ్యకశిపుడు కోరుకున్నది ముక్తి.
ప్రహ్లాదుడిది అనన్య భక్తి.
కనుకనే స్తంభం నుండి ఆవిర్భవించిన నృసింహ దైవతం, హిరణ్యకశిపుడిని తన ఒడిలో పడుకోబెట్టుకుని, అతని పేగులు అనే కర్మమాలలను తుంచి, అతని కలుష రక్తాన్ని తాగి, పరమ కరుణతో సాయుజ్యం అనుగ్రహించటం, ఒక అద్భుత యోగం! అదే సమయంలో పరమ భక్తుడైన ప్రహ్లాదుడికి రాజ్య భోగాన్ని ఇవ్వటం, ఆశ్చర్య యోగం! భోగికి యోగాన్ని, యోగికి భోగాన్ని ఇవ్వటం ఒక దివ్యలీల.
నరసింహ అవతారం కరుణ, ప్రజ్ఞ, రౌద్ర, బీభత్స, దయ, దివ్యశక్తుల మేలు కలయిక. అది జగతికి మేలుచేసే కరుణావతారం. కారణావతారం!
జ్వాల, మాలోల, అహోబల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన అనే… తొమ్మిది తత్త్వాలతో అహోబిలంలో అర్చామూర్తిగా విరాజమానం అవుతున్న విధానం చరిత్రాత్మకం! యాదమహర్షి తపఃఫలంగా గుట్టపై వెలసిన నృసింహ దైవతం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి!
యాదాద్రి మహాక్షేత్రంలో ఆయన శాంతమూర్తి. అష్టలక్ష్ములను అనుగ్రహించే ఈ పంచనారసింహ క్షేత్రం అనుపమాన పుణ్యక్షేత్రం. జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్ర, లక్ష్మీనరసింహ తత్త్వాలతో రంజిల్లు, శోభిల్లు ఆనంద నిలయమే యాదాద్రి!
ఆపదలో అభయాన్ని అనుగ్రహించే స్వామి ఇక్కడ క్షిప్రప్రసాది, అంటే అడిగిన తక్షణమే ఆదుకునే కరుణాలయం. అందువల్లనే శంకర భగవత్పాదులు ‘లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం’ అని స్తుతించారు. ఫలితం, తక్షణమే లభించిన చేయూత!
దశావతారాలలో నాలుగవది అయిన నరసింహావతారం సర్వత్రా వ్యాపించి ఉండే దైవశక్తికి నిదర్శనం. శక్తి, యుక్తి, ముక్తి త్రివేణిగా అభివ్యక్తమైన పరమాత్మ పరాక్రమ క్రమం.
– వి.యస్.ఆర్. మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త