Yadadri Laxmi Narasimha Swamy | హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామిని శాంతపర్చడానికి బ్రహ్మరుద్రాది దేవతలంతా వేవేల స్తుతులు చేశారట. యక్షులు, కిన్నరులు, కింపురుషులు పరిపరివిధాల స్తోత్రాలు చదివారట. భక్తితో సేవలు చేశారట. చివరికి ప్రహ్లాదుడు భక్తితో వేడుకుంటే గానీ ఉగ్రమూర్తి శాంతించలేదట. ఆనాటి నుంచి స్వామి ఎక్కడ వెలసినా రకరకాల సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. విధవిధాల కైంకర్యాలు జరుగుతూనే ఉన్నాయి. యాదాద్రిలోనూ నిత్యపూజలతో పాటు పర్వదినాల్లో ప్రత్యేక సేవలు నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రతి ఏకాదశి పర్వం రోజు లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్ల సహస్ర నామార్చన చేస్తారు అర్చకులు. రకరకాల పూలతో సుమారు రెండుగంటలపాటు పుష్పార్చన కొనసాగుతుంది. ఈ వేడుకలో భక్తులు అశేషంగా
పాల్గొంటారు.
శ్రావణ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆశ్వయుజంలో మూల నక్షత్రం మొదలు శ్రవణ (విజయ దశమి) నక్షత్రం వరకు త్రిరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. తిరుమంగై ఆళ్వారుల తిరునక్షత్ర ఉత్సవం, అన్నకూట ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో స్వామివారు ఎంత ఎత్తు ఉన్నారో అంత అన్నం రాశిగా పోసి మహానైవేద్యం సమర్పిస్తారు. ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.
నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి. ఆ మహోగ్రమూర్తిని శాంతపరచడానికి ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు వేలాదిగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. తర్వాత ఆలయంలో మూడున్నర గంటలపాటు శ్రీవారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు. 108 కలశాలతో 108 వేదమంత్రాలు, 108 రకాల ఓషధులు, పంచామృతాలతో స్వామి వారికి అభిషేకం చేస్తారు. తర్వాత మూలమంత్ర, ముక్తిమంత్ర హోమాలు జరుగుతాయి.
నరసింహస్వామి ఆవిర్భవించిన వైశాఖ శుక్ల చతుర్దశి నృసింహ జయంతిగా లోకప్రసిద్ధి. ఈ సందర్భంగా ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి. మొదటి రోజు లక్ష కుంకుమార్చన, రెండో రోజు లక్ష పుష్పార్చన, మూడో రోజు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం స్తంభ స్థానారాధన వైభవంగా జరుపుతారు.
మార్గశిర మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుర్మాస ఉత్సవాలు మొదలవుతాయి. ఈ నెల ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేకమైనది కావడంతో, నెలరోజులపాటు తిరుప్పావై పాశురాలను స్వామివారికి వినిపిస్తారు. అమ్మవారికి తిరుప్పావై మహోత్సవం జరుగుతుంది. ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి (వైకుంఠ) ఏకాదశిని పురస్కరించుకొని ఆళ్వారు దివ్యప్రబంధ మహోత్సవాలు (అధ్యయనోత్సవాలు) జరుగుతాయి. ఇందులోభాగంగా స్వామివారికి ఆరు రోజులపాటు ఉదయం, సాయంత్రం అలంకార సేవలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనమిస్తారు. భోగినాడు గోదాదేవి కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది. మరుసటి రోజు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి, స్వామివారి దగ్గరికి చేర్చడంతో ధనుర్మాస ఉత్సవాలు పూర్తవుతాయి.
యాదాద్రి సన్నిధానంలో కార్తిక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తెల్లవారుజామునే కొండపై దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొంటారు. అన్నవరం సత్యదేవుడి సన్నిధి తర్వాత యాదాద్రిలోనే అత్యధికంగా వ్రతాలు జరుగుతాయి. కార్తిక పౌర్ణమి నాడు స్వామి వారికి కృత్తిక దీపోత్సవం జరుపుతారు.