TTD News | కార్తీక మాసంలో విష్ణుపూజల్లో భాగంగా సోమవారం నాడు తిరుమల వసంత మండపంలో శ్రీ ధన్వంతరి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ధన్వంతరిని దర్శించుకుని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అంతకుముందు ఉదయం వేళ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు, వారికి అభిముఖంగా శ్రీ ధన్వంతరి స్వామిని వసంత మండపంలో వేంచేపు చేశారు.
ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు ఎన్వీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ క్షీరసాగర మథనంలో చివరిగా శంఖు చక్రాలు, అమృత కళశంతో ఉద్భవించిన ధన్వంతరి స్వామి ఆయుర్వేద విద్యకు ప్రసిద్ధి అని, శ్రీ మహావిష్ణువు అవతారమని చెప్పారు. ధన్వంతరి పూజ వల్ల ప్రాణి కోటికి హాని కలిగించేవి నశించి, సంపూర్ణ ఆరోగ్యం, శాంతి సౌభాగ్యాలు చేకూరుతాయని తెలిపారు.
ముందుగా విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థనాసూక్తం, సంకల్పం చేశారు. అనంతరం శ్రీ ధన్వంతరి అష్టోత్తర శతనామావళి, ధన్వంతరి మంత్ర పారాయణం నివేదన, హారతి సమర్పించారు. అనంతరం క్షమాప్రార్థన, మంగళంతో పూజ ముగిసింది. ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల పండితులు, అధికారులు పాల్గొన్నారు.