శ్రీశైలం : కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రమైన శ్రీశైలంలో ధన్వంతరీ జయంతి ప్రత్యేక పూజలు జరిపించారు. లోక కల్యాణార్థం గురువారం ఉదయం అమ్మవారి యాగశాలలో అర్చక వేదపండితులచే ధన్వంతరీ హోమం, ఆయుష్ హోమ జపపారాయణలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో భాసిల్లాలని.. అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లకుండా ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోవాలని కాంక్షిస్తూ మహాసంకల్ప షోడషోపచార పూజా క్రతువులు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్ ఆధ్వర్యంలో ఆలయ సేవగా సుమారు రెండు గంటలపాటు హోమ కార్యక్రమం జరిగింది.
నందీశ్వరునికి అభిషేకాలు..
త్రయోదశి సందర్భంగా ప్రదోషకాలంలో నందీశ్వరునికి ఉదకాభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి క్షేత్ర దర్శనార్థం రాలేని భక్తుల సౌలభ్యం కోసం గోత్రనామర్చనలతో నిర్వహిస్తున్న పరోక్షసేవలకు మంచి స్పందన వస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. అందులో భాగంగా శెనగల బసవన్న అభిషేక కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు. అదే విధంగా త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామికి వార పూజలు చేసినట్లు ప్రధాన అర్చకులు భద్రయ్య తెలిపారు.