ఇది ధనుర్మాసపు గోవింద సుప్రభాతం
తిరుమల క్షేత్రంలో ధనుర్మాసంలో ముప్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు (తొండరడిప్పొడియాళ్వార్ అంటే భక్తాంఘ్రిరేణు ఆళ్వార్) రచించిన పాశురాలు విన్న తరువాత శ్రీనివాసుడు పొద్దున్నే లేవగానే శ్రావ్యంగా ఈ గోదాదేవి (ఆండాళ్) రచించిన తిరుప్పావు పాశురాలు రోజుకొకటి చొప్పున వింటాడు. అలాగే రోజులో ఒకసారి 30 పాశురాలూ ఆలకిస్తాడు. గోదా గీత గోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. కనుక ఇది ధనుర్మాసపు గోవింద సుప్రభాతం. దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంథ రహస్యాలను రోజుకో రెండుగంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమాలు 30 రోజులు సాగి, ధనుర్మాసం చివరి రోజు భోగి సందర్భంగా గోదాదేవి రంగనాథుని కల్యాణం వైభవంగా జరుగుతుంది.
తెలుగు రాష్ర్టాలు రెండిటా నారాయణుని కోవెలల్లో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పొద్దున్నే తిరుప్పావై పారాయణాలు, సాయంత్రం తిరుప్పావై ప్రవచనాలు ప్రబోధాలు వినిపిస్తూ ఉంటాయి. వందల మంది వైష్ణవాచార్యులు, మహిళా శిరోమణులు తిరుప్పావై అర్థ తాత్పర్యాలను వివరిస్తూ ఉంటారు. దక్షిణాది రాష్ర్టాలలో విస్తృతంగా తిరుప్పావై పారాయణాలు జరుగుతాయి. ఈ 30 గీతాలను కర్ణాటక శాస్త్రసంగీతకారులు కీర్తనలుగా పాడారు. నాట్యకీర్తనలుగా కూడా పాశురాలు భాసిస్తున్నాయి. సంక్రాంతి దాకా సాగే ఈ సిరినోము ఓ ఆధ్యాత్మిక ఉద్యమం.
గోదాదేవి రచించిన తిరుప్పావై కావ్యాన్ని ఉపనిషత్తుల సారాంశం అని వర్ణిస్తారు. భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కాబట్టి గీతోపనిషత్ అనీ, తిరుప్పావైని గోదోపనిషత్ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయంలోనే పఠించాలి. కాబట్టి తిరుప్పావైని కూడా సూర్యాస్తమయం తరువాత అనుసంధానించకూడదని అంటారు.
శ్రీ కృష్ణుడు ఉండే అందాల పల్లె వ్రేపల్లెలో కరువు వచ్చి అందరూ ఆందోళన చెందారు. గోపగోపీజనం అంతా కలిసి క్రిష్ణయ్య దగ్గరికి వెళ్లి ‘ఏం చేద్దాం’ అని అడిగారు. తమను ఆదుకోమన్నారు. దీనికేదైనా వ్రతముంటే చేద్దాం అని గోపకులంలో పెద్దవారు సూచించారు. ‘చిన్నారి కన్నె పిల్లలైన గోపికలతో ఈ వ్రతం చేయిస్తే బాగుంటుంద’ని నిర్ణయించారు. సరేనని శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలను వివరించాడు. ‘మన వ్రతం పెందలకడ మొదలవుతుంది. కాబట్టి మీరంతా తెల్లవారుజామున రావాలి సుమా!’ అని గోపికలకు మరీమరీ చెప్పి పంపించాడు గోవిందుడు. దాంతో మొదలైంది ఈ మహాకావ్య తిరుప్పావై కథావస్తువు.
మరునాడు శ్రీకృష్ణుడితో కలిసి వ్రతం చేస్తున్నామన్న ఆనందం, ఉత్సాహం ఎక్కువై గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాములు గడుస్తాయా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రి గడిపారు. తెల్లవారుజామునే రమ్మన్నాడు కిట్టయ్య, కాబట్టి ముందే లేచి అందరినీ లేపుదాం అని బయల్దేరారు గోపికలు. ఇదీ తిరుప్పావై నాందీ ప్రస్తావన.
తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన నాలుగువేల కవితలను నాలాయిరమ్ (నాల్ అంటే నాలుగు, ఆయిరం అంటే వేలు) అంటారు. శాత్తుమరై అంటే నైవేద్యం తరువాత సాగే మంగళా శాసనం. నాలాయిర ప్రబంధ పారాయణం తిరుప్పావైతో ముగుస్తుంది. అంటే ప్రణవనాదంతో ముగుస్తుందని అర్థం. ద్రావిడ (తమిళ) ప్రబంధ పారాయణానికి ఏ ప్రతిబంధకాలూ లేవు. కఠినమైన నిబంధనలు లేవు. వర్ణభేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అనుసరించవచ్చు. సంస్కృత భాషతో సమానమైన తమిళ వేదమని అంటారు.
తిరుప్పావై జీయర్
అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. తిరునారాయణ మంత్ర సారాంశాన్ని తిరుప్పావైలో పాశురంలోని అక్షరాక్షరంలో పొదిగి గోదాదేవి అందరికీ అందించినట్టే, నారాయణుని తిరుమంత్రాన్ని గుడి గోపురం ఎక్కి అందరికీ రహస్యాలు విప్పి చెప్పాడు శ్రీరామానుజుడు. కులమతభేదాలు లేకుండా అందరికీ నారాయణుని చేరే జ్ఞాన వ్రత మంత్ర సాధనా సోపానాలు తెలియాలని తపించిన వారే- గోదాదేవి, శ్రీరామానుజుడు. అందుకే శ్రీరామానుజులను తిరుప్పావై జీయర్ అంటారు. గోదాదేవి కావేరి నదితీరంలో శ్రీరంగడిలో లీనమైన రెండువందల సంవత్సరాల తరువాత 1000వ సంవత్సరం ప్రాంతంలో జన్మించిన శ్రీరామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం శ్రీరామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడం ఒక కారణం. తనకు రంగడితో వివాహమైతే మదురైకి దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో శ్రీసుందరబాహుస్వామికి వేయిబిందెల పాయసం చేయిస్తానని మొక్కుకుందట గోదాదేవి. ఆ మొక్కును శ్రీరామానుజుడు తీర్చారు. గోదాదేవి శ్రీరంగడిలో లీనం కావడం వల్ల ఆమె తన మొక్కును తీర్చలేకపోయింది. ఆ విషయం చెబుతూ శ్రీరామానుజుడు శ్రీసుందరబాహుస్వామి ఆలయానికి వెళ్లి వేయిబిందెల పాయసం సమర్పించారు.
– మాడభూషి శ్రీధర్