శరన్నవరాత్రులలో ఐదో రోజున అమ్మవారిని స్కందమాతగా అలంకరించి ఆరాధిస్తారు. ‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’.. శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తన యుడికి స్కందుడు అని పేరు. స్కందుని తల్లిగా అమ్మవారు
‘స్కందమాత’ అయ్యారు. నవదుర్గలలో ఇది ఐదో రూపం. స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. నాలుగు చేతులు కలిగి ఉంటుంది. తన కుమారుడైన బాల స్కందుడిని ఒక చేతితో ఎత్తుకొని, రెండు చేతుల్లో పద్మాలు ధరించి, మరో చేతితో అభయమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా ఆరాధించే భక్తుల హృదయాలను పవిత్రం చేసి, ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. కుమారస్వామిని ఎత్తుకొని ఉండటం వల్ల.. ఈ తల్లిని పూజించే క్రమంలో స్కందుడి అనుగ్రహమూ లభిస్తుంది. స్కందమాతను అగ్నికి అధిష్ఠాన దేవతగా, ప్రాకృతిక శక్తిగా, కాలస్వరూపిణిగా, విశ్వజననిగా ఆరాధిస్తారు సాధకులు. కుమారుడికి ఆయుధాన్ని అనుగ్రహించిన స్కందమాత.. తనను కొలిచే భక్తులకు శక్తియుక్తులను ప్రసాదిస్తుంది. దేవదానవ యుద్ధంలో స్కందమాత రూపంలో అమ్మవారు అనేకమంది రాక్షసులను సంహరించింది.
నైవేద్యం: దద్దోజనం (పెరుగన్నం)