ఊపిరి పీల్చాలన్నా శక్తి కావాలి. కనురెప్ప వేయాలన్నా శక్తి కావాలి. ప్రతి కణంలోనూ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. మన అవసరాన్ని బట్టి ఆ శక్తి అనుగ్రహంతో మనలోని శక్తి ప్రజ్వరిల్లుతుంది. ‘యాదేవీ సర్వభూతేశు శక్తి రూపేణ సంస్థితా’ మంత్రార్థం ఇదే! మనలో ఉన్న శక్తిని ద్విగుణీకృతం చేసే సూత్రం నవరాత్రం. శక్తులన్నీ తన అధీనంలో ఉంచుకున్న ఆదిపరాశక్తి
అనుగ్రహం కోరుతూ నవరాత్ర వ్రతం ఆచరిస్తారు. దసరా వేడుకకు నాంది పలుకుతూ మొదలైన శరన్నవరాత్రులను మహోన్నతంగా చేసుకుందాం.
మానవజాతి సమస్తం శక్తి కావాలని కోరుకుంటుంది. ఆ శక్తి మనుషుల అవసరాన్ని బట్టి తన స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. శక్తి అనే శబ్దం వింటూనే శరీరంలో ఒక కదలిక, ఆలోచనలో చైతన్యం పుడతాయి. అందుకే ప్రతి మనిషీ నిరంతరం ఏదో ఒక రూపంలో శక్తిని పొందాలని భావిస్తుంటాడు. ఆ శక్తికి ఆధ్యాత్మిక రూపమే ఆదిపరాశక్తి అయిన జగన్మాత. విద్యుచ్ఛక్తి ఉంటేనే విద్యుత్ పరికరాలు పనిచేసినట్లు… ఆదిపరాశక్తి అనుగ్రహం లభిస్తేనే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. ఆ తల్లి అనుగ్రహం కోసం చేసే ఆరాధనే ‘నవరాత్ర వ్రతం’.
‘చైత్రేశ్వినే తథాషాఢే మాఘే కార్యోమహోత్సవః’-
చైత్రం, ఆషాఢం, ఆశ్వయుజం, మాఘం ఈ నాలుగు నెలల్లో నవరాత్ర వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ నాలుగు మాసాల్లో (రుతువుల్లో) శరత్ రుతువులో ఆశ్వయుజ మాసంలో చేసే వ్రతం విశేషమైనది. ఈ శరన్నవరాత్రులతోపాటు వసంత నవరాత్రులు ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనవో, వైజ్ఞానికంగానూ అంతే విశేషమైనవి. ఎందుకంటే వసంత, శరత్ రుతువుల్లో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. భౌతికంగా సమస్యాత్మకమైన కాలం ఇది. అందుకే ఈ రుతువులను యమదంష్ట్రలుగా భావిస్తారు. ఈ సమయంలో మనుషులకు విపరీతమైన జ్వరాలు వస్తాయని, పలురకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయని చెబుతారు. ‘వసంతశరదా వేవ జననాశకరా వుభౌ’ అని దేవీభాగవతం పేర్కొన్నది. ఈ దుస్థితికి విరుగుడుగా మన శాస్ర్తాలు ఈ రుతువుల్లో అత్యంత నియమ నిష్ఠలతో వ్రతాలు, పూజలు, యజ్ఞాలు ఆచరించమని సూచించాయి. తద్వారా శరీర సంబంధమైన అనారోగ్యాలు కలగకుండా ఆరోగ్య రక్షణతోపాటు ఆధ్యాత్మిక శిక్షణ పెంచే ఏర్పాటుచేశాయి. వ్రతాలను ఆచరించడం ద్వారా ఐహిక ఫలాలతోపాటు ఉత్తమలోకాలను, పరమోత్కృష్టమైన మోక్షాన్నీ పొందవచ్చు.
నవరాత్రులు అంటే..
నవరాత్ర శబ్దం ‘ఒక మహావ్రతం పేరు’ అని స్కాంద పురాణం పేర్కొన్నది. నవరాత్రుల్లో ఒక తిథి పెరిగినా, తగ్గినా ‘నవరాత్రులు’ అనే వ్యవహరిస్తారు. అంతేకానీ తొమ్మిది రాత్రులు అని కాదు. ఈ నవరాత్రులు ఎలా చేయాలి? అనే విషయాన్ని దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో విస్తారంగా వివరించారు.
భాద్రపద అమావాస్య నాడే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఉదయం మంగళస్నానాలు చేసి అమ్మవారి మూర్తిని గానీ, నవార్ణయంత్ర సహితమైన కలశాన్ని గానీ వంశ ఆచారాన్ని అనుసరించి స్థాపించి, వ్రతం ఆరంభించాలి. నవరాత్రుల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు వేళల్లోనూ యథాశక్తి అమ్మవారిని ఆరాధించాలి. చతుష్షష్టి (64) ఉపచారాలతో గానీ, షోడశ ఉపచారాలతో గానీ యథాశక్తి పూజించాలి. రోజుకు ఒకరిని పెంచుకుంటూ కుమారీ, కన్యలను పూజించే సంప్రదాయమూ ఉంది. అమ్మవారు ‘సువాసిన్యర్చనప్రీత’ కాబట్టి సువాసినీ పూజ కూడా చేస్తారు. ప్రతిరోజూ జగన్మాత పూజ, సువాసినీ భోజనాలు, హవనాలు, భజనలు మొదలైన వాటితో ఈ నవరాత్ర వ్రతం చేస్తారు.నవరాత్ర వ్రతాన్ని సాధారణంగా తొమ్మిది రోజులు నిర్వహిస్తారు. అలా చేయలేనివారు ఏడు రోజులు, ఐదు రోజులు, మూడు రోజులు కూడా నిర్వహించవచ్చని, ఆ శక్తీ లేనివారు ఒకరోజు అయినా చేయవచ్చని మార్కండేయ పురాణం చెబుతున్నది.
తొమ్మిది రోజులు- పాడ్యమి నుంచి నవమి వరకు
ఏడు రోజులు- తృతీయ నుంచి నవమి వరకు
ఐదు రోజులు- పంచమి నుంచి నవమి వరకు
మూడు రోజులు- సప్తమి నుంచి నవమి వరకు
ఒక రోజు- నవమి నాడు
పరాశక్తి నవరూపాలు
నవరాత్ర వ్రతంలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంగా ఆరాధిస్తారు.
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ
సప్తమం కాళరాత్రీ చ మహాగౌరీతి చాష్టమం
నవమం సిద్ధిదాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః
శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి ఇలా వరుసగా తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తారు. ఈ తొమ్మిది అవతారాలూ వేరుకావు. దుర్గాదేవి తొమ్మిది భేదాలే శైలపుత్రి మొదలుగా ఉన్న తొమ్మిది శక్తులు. దుర్గాదేవి నవరూపాలు ధరించడం వెనుక ఉన్న ఆంతర్యం తెలుసుకుంటూ, భక్తిశ్రద్ధలతో యథాశాస్త్రం వ్రతాన్ని ఆచరిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. మొదట భౌతిక సుఖాలు పొంది, కొంతకాలానికి అంతఃకరణ శుద్ధి ఏర్పడి సచ్చిదానంద రూపమైన నిత్యశుద్ధ బుద్ధ స్వభావమైన మోక్షాన్ని అందుకోగలుగుతాం.
చండీ హవనం
ఈ నవరాత్ర వ్రతం సిద్ధి కోసం చండీహవనం చేస్తుంటారు. భక్తులు తమ శక్తిని అనుసరించి నవచండి, శతచండి, సహస్రచండి, అయుతచండి హోమం నిర్వహిస్తారు. చండీ ఉపాసనలో జపచండి, హోమచండి, తర్పణచండి అనే మూడు విధాలు కనిపిస్తాయి. జపచండి అంటే పారాయణాలు, హోమచండి అంటే హవనం, తర్పణచండి అంటే తర్పణాలు చేస్తారు. నవచండి, శతచండి, సహస్రచండి మొదలైన హవనాల సంఖ్యను అనుసరించి వీటి సంఖ్యను నిర్దేశిస్తారు.
నవచండి
పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది పారాయణాలు చేసి ఒక హవనం చేయాలి.
శతచండి
పదిమంది రుత్విజులు మొదటి రోజు పదిసార్లు, రెండో రోజు ఇరవైసార్లు, మూడో రోజు ముప్పై సార్లు, నాలుగో రోజు నలభైసార్లు మొత్తం కలిపి వంద పారాయణాలు చేస్తారు. అందులో దశాంశం (పదోవంతు) అంటే 10 చండీ పాఠాలు హోమం చేస్తారు. అందులో పదోవంతు చండీపాఠంతో తర్పణం విడుస్తారు. ‘సర్వోపద్రవ నాశార్థం శతచండీం సమారభేత్’ అని శతచండీ హోమం వల్ల సర్వ ఉపద్రవాలూ తొలగిపోతాయని శాస్త్రం.
సహస్రచండి
100 మంది రుత్విజులు మొదటిరోజు 100 పారాయణాలు, రెండోరోజు 200 పారాయణాలు, మూడోరోజు 300 పారాయణాలు, నాలుగోరోజు 400 పారాయణాలు మొత్తంగా వెయ్యి చండీ పారాయణాలు చేస్తారు. అందులో పదోవంతు- 100 చండీ పాఠాలతో హోమం, అందులో పదోవంతు- 10 చండీ పాఠాలతో తర్పణాలు చేస్తారు. ‘రాజ్యభ్రంశే మహోత్పాతే జనమారే మహాభయే’ అని రాజ్యభ్రంశమైనప్పుడు, మహోత్పాతాలు, మహాభయాలు ఏర్పడినప్పుడు అమ్మవారి అనుగ్రహం కోరుతూ సహస్ర చండి చేయడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతున్నది. సహస్ర చండికి దశ గుణాధికం అయుత చండి, దీనికి దశ గుణాధికం లక్షచండి. చండీహవనం చేసే సందర్భంలో గణపతి, దుర్గాదేవి, లక్ష్మీదేవి, స్థాపిత ఇతర దేవతా హవనాలు కూడా చేయడం విశేష ఫలదాయకం.
శాస్ర్తుల వేంకటేశ్వరశర్మ
శ్రీ బగలాముఖీ శక్తిపీఠం
శివంపేట ,98499 09165