అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాటి శని దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి?- కేసుగారి రాములు, దుబ్బాక
నవగ్రహాల్లో ఒకడైన శని దేవుడిని శనైశ్చరుడు అని కూడా పిలుస్తారు. శనైశ్చరుడు అంటే నెమ్మదిగా అడుగులు వేసేవాడు అని అర్థం. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించడాన్ని ‘గ్రహచారం’ అంటారు. సూర్యుడి చుట్టూ తిరగడానికి శనికి సుమారు 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో శని ఒక్కోరాశిలో దాదాపు రెండున్నరేండ్లు సంచరిస్తాడు. ఒక వ్యక్తి జన్మరాశి నుంచి నాలుగోరాశిలో శని ఉంటే దానిని అర్ధాష్టమ శని అంటారు. ఎనిమిదో రాశిలో ఉన్నప్పుడు అష్టమ శనిగా పిలుస్తారు. జన్మరాశికి 12వ రాశిలో, అదేరాశిలో, రెండో రాశిలో శని ఉండే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. మొత్తంగా ఏల్నాటి శని ప్రభావం సుమారు ఏడున్నరేండ్లు ఉంటుంది. దీనినే సాడేసాత్ శని అని కూడా సంబోధిస్తుంటారు. గోచార రీత్యా అర్ధాష్టమ, అష్టమ, ఏల్నాటి శని ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతున్నది. ఈ కాలంలో ఆస్తినష్టం, ఆరోగ్య భంగం, ఉద్యోగంలో ఒత్తిడి తదితర దుష్ఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేసింది. అయితే, శనైశ్చరుడు అనుగ్రహించే గ్రహం కూడా! భక్తిప్రపత్తులతో ఆయన్ను పూజించి, యథాశక్తి బీదసాదలకు సాయపడితే ప్రసన్నుడు అవుతాడు.
గోచారరీత్యా, జాతకరీత్యా శని దోషాలు తొలగిపోవాలంటే ప్రతీ శనివారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించడం మంచిమార్గం. నవగ్రహాలు ఉన్న ఆలయమైతే శనైశ్చరుడికి ప్రదక్షిణలు చేయడం, తైలాభిషేకం చేయడం మంచిది. అంతేకాదు ఏదైనా శనివారం నాడు కానీ, శని త్రయోదశి నాడు గానీ నువ్వులనూనెతో తలంటు స్నానం చేసి, రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి, శనైశ్చర విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకిస్తే దుష్ప్రభావం తొలగిపోతుందని జ్యోతిషశాస్త్రం పరిహారాల్లో పేర్కొని ఉంది. ఇనుముకు శని అధిపతి. కాబట్టి ఇనుప వస్తువులు దానం చేసినా శని దోషం పోతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా, దివ్యాంగులు, అనాథలకు సాయం చేస్తే శనైశ్చరుడు తక్షణం ప్రసన్నుడు అవుతాడని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ‘ఓం నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం॥’ మంత్రాన్ని పఠిస్తూ శనైశ్చరుడికి ప్రదక్షిణలు చేస్తే మంచిది.
-డా॥ శాస్ర్తుల రఘుపతి, 73867 58370