భగవత్ ఆరాధనకు ఉండాల్సిన తొలి అర్హత నిండైన భక్తి. నిష్కల్మషమైన భక్తితో ఆరాధిస్తే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని రామాయణంలో శబరి వృత్తాంతం తెలియజేస్తుంది. మతంగ ముని ఆదేశానుసారం రాముడి రాక కోసం శబరి ఏండ్లుగా ఎదురు చూస్తుంటుంది. అడవిలో సీతను వెతుకుతూ రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి చేరుకుంటారు. రాముడిని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తుంది శబరి. తాను సేకరించిన పండ్లను స్వామికి నివేదిస్తుంది. అయితే, శబరి ఎంగిలి పండ్లను ఇస్తే రాముడు వాటిని ప్రేమగా స్వీకరించాడని జనశ్రుతులు ఉన్నాయి. పద్మ పురాణంలో చెప్పినట్లు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు యోగ్యమైనవాటిని పరీక్షించి ఇవ్వాలనే మర్యాద శబరి పాటించిందన్న సమర్థనలూ ఉన్నాయి. జీవితానుభవం ఉన్న ఆ వృద్ధురాలు రేగుపండ్లను ఎంగిలి చేయకుండా గోరుతో గిల్లి, రుచి చూసి రాముడికి ఇచ్చిందన్న వ్యాఖ్యానాలూ ఉన్నాయి. ఎలా ఇస్తేనేం, నిష్కల్మషమైన మనసుతో ఆతిథ్యం ఇస్తే భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడన్న సందేశాన్ని చాటిచెబుతుంది శబరి వృత్తాంతం. రాముడి ఆనతి మేరకు యోగాగ్నిలో తనువు త్యాగం చేసి స్వర్గానికి చేరుకుంది. గీతాచార్యుడు చెప్పినట్లు ప్రతిఫలం ఆశించకుండా పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది సమర్పించినా దైవానుగ్రహం లభిస్తుందని భక్త శబరి గాథ తెలియజేస్తుంది.
– శ్రీ