స్వాతంత్య్రం సిద్ధించుకున్న ఈ ఆనంద సమయంలో, అతి ప్రాచీనమైన ఈ భారతదేశ ప్రజలందరూ, సంపూర్ణ హృదయంతో,
ఏకమనస్కులై, భగవంతుని ప్రార్థించవలసి ఉన్నది. అపారమైన అధ్యాత్మ జ్ఞానాన్ని పొందటానికి కావలసిన మానసిక శక్తిని ప్రసాదించవలసినదిగా, భగవంతుని ప్రార్థించవలసి ఉన్నది. కేవలం భగవత్ అనుగ్రహం వల్లే, సముపార్జించుకున్న
స్వాతంత్య్రాన్ని కాపాడుకోగలం. భగవంతుడి కృప వల్లే, సమస్త మానవాళి ఆనందమయమైన జీవితాన్ని గడపగలదు.
మనం గమనించవలసిన ఒక విశేషమున్నది. భగవంతుని చక్రమే అదృష్టవశాత్తు మన జాతీయపతాకం మధ్యలో స్థానాన్ని పొందింది. ధర్మం, చక్రం రూపంలో ఏ విధంగా ప్రకాశిస్తుందో భగవద్గీత మూడో అధ్యాయంలో పదహారో శ్లోకంలో ‘ఏవం ప్రవర్తితం చక్రం’ అని శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించాడు. అదే అధ్యాయంలో 14, 15 శ్లోకాల్లో ‘మానవ శరీరం అన్నం నుంచి పుడుతున్నది. ధాన్యం వర్షం వల్ల వృద్ధి చెందుతున్నది. వర్షం.. యజ్ఞం వల్ల కురుస్తున్నది. యజ్ఞాలు వేదాలలో వివరంగా ఉన్నాయి. వేదం పరమాత్మ నుంచి ఉద్భవించింది. ఆ పరమాత్మ అక్షరరూపుడై ఉన్నాడు. పరమాత్మ, వేద విహితమైన యజ్ఞ రూపంలో ఉన్నాడని ధర్మచక్రం చెబుతున్నది. అశోక చక్రవర్తి ధర్మబద్ధమైన స్మృతిగా ధర్మం, సంపద, సంతోషం, మోక్షాలను ఈ స్వాతంత్య్రం మనకు అనుగ్రహించుగాక.
మన జాతీయ పతాకంలో మూడు చారలు వున్నాయి. అవి కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగులతో కూడి ఉన్నాయి. ఇవి మనకో విషయాన్ని సూచిస్తున్నాయి. శత్రువుల నుంచీ, దుష్టత్వం నుంచీ మనలను రక్షించే సైనిక బలమూ, సౌభాగ్యం కోసం సంపదా, సరైన పరిపాలన కోసం జ్ఞానమూ ఈ దేశానికి అవసరం. ఒక విషయం గుర్తుంచుకోవాలి. ముదురు ఆకుపచ్చ రంగు మనలను రక్షించు పరాశక్తి రూపమైన దుర్గది. కాషాయ రంగు సంపద, సౌభాగ్యాలను అనుగ్రహించే మహాలక్ష్మిది. తెలుపు రంగు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీ దేవిది. ఈ మూడు దేవీశక్తుల రంగులే, మనకు మూడు చారలుగా జాతీయ పతాకంలో కనపడటం యాదృచ్ఛికం.
స్వాతంత్య్రం కోసం భారతదేశం ఎంతో కాలంగా చాలా కష్టపడింది. భగవంతుడి అనుగ్రహం వల్ల, మహావ్యక్తుల ఆశీర్వాదం వల్ల, ప్రజల మహాత్యాగం వల్ల మనం స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. ఎంతో కష్టపడి గెలుచుకున్న ఈ స్వాతంత్య్రంతో మన దేశం సౌభాగ్యవంతంగా, కరువులు లేకుండా, సమాజపరమైన ఘర్షణలు లేకుండా, సౌభ్రాతృత్వంతో, దయా విశేషంతో ప్రవర్ధిల్లునట్లుగా సర్వవ్యాపకుడైన భగవంతుడి అనుగ్రహ వర్షం కోసం ప్రార్థిద్దాం! స్వాతంత్య్రం సిద్ధించింది కాబట్టి, దానిని పెంచుకోవటానికి అందరం కష్టపడదాం. మనలను మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్లయితే, మనల్ని మనం స్వతంత్రులుగా పరిగణించుకోవచ్చు.
మన ఇంద్రియాలను మనం అదుపులో పెట్టుకోలేం. మన కోరికలను అణచుకోలేం. మనలను నిరంతరం బాధించే కోపాన్ని ఆపుకోలేం. ఎంత సంపాదించుకున్నా, మనం తృప్తిని పొందలేం. ప్రాపంచికమైన కష్టాలు మనల్ని బాధిస్తుంటాయి. ఈ కష్టాలను చూసినప్పుడల్లా మనసు గందరగోళంలో పడుతుంది. వీటన్నిటి నుంచి బయటపడే మార్గమేమిటి? ముందుగా తీవ్రంగా సంచలిస్తున్న మనసును, నెమ్మదిగా నియంత్రించాలి. మనసును ప్రశాంతపరచగానే, మనకేమీ అక్కరలేని స్థితి వస్తుంది. అటువంటి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని నిశ్చయంగా ప్రసాదించే మనసును సాధించటం కోసం ప్రయత్నించాలి. అన్ని ఆలోచనలను పక్కన పెట్టి భగవంతునిపై ధ్యానం ఉంచాలి. అప్పుడు మనసు నెమ్మదిగా ప్రశాంతం అవుతుంది. ఆ స్థితిలో కామక్రోధాలను అణచుకోగల మానసికశక్తి వస్తుంది. అధ్యాత్మజ్ఞానం వేగవంతం అవుతుంది. ఎవరు అలాంటి అధ్యాత్మజ్ఞానాన్ని పొందుతారో, వారే నిజమైన స్వతంత్ర పౌరులు.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భంగా 1947లో కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి అనుగ్రహ భాషణం.
-తెలుగు సేత: వీఎస్ఆర్ మూర్తి