పుట్టుకే మాయ! భూమ్మీదికి వచ్చింది మొదలు మాయలే! పొత్తిళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడే పూతన మాయను ఛేదించినవాడు.అడ్డాలనాడే శకటాసురుణ్ని గింగిరాలు కొట్టించినవాడు. కాళీయుడిపై తాండవం మాయ. గోపికలను ఆటపట్టించడం మాయ. రాధమ్మకు వశపడటం మాయ. ఆ నందలాలుడి మాయలన్నీ అద్భుతమైన లీలలే! వాటిని తలచినంత మాత్రాన మనకు కలిగేది సచ్చిదానందమే!!
దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడి శక్తులు అపరిమితమైనవని భాగవతం వివరిస్తున్నది. వైవిధ్యభరితమైన ఈ శక్తులన్నీ జ్ఞాన, బల, క్రియా సంపూర్ణమైనవి. ఈ శక్తులతో దేవదేవుడి కార్యాలన్నీ అప్రయత్నంగా, సహజరీతిలో జరిగిపోతుంటాయి. అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ‘మాయ’ అనే పదాన్ని వివరిస్తూ, ‘మాయ అంటే శక్తి. మాయ అంటే భ్రాంతి, మాయ అంటే అనురాగం కూడా’ అని తెలిపారు. భగవంతుడు తన అనంతమైన శక్తులతో అద్భుతమైన లీలలను చూపడం ఆయన యశస్సును మరింత విస్తృతపరుస్తుంటుంది. వైవిధ్యభరితమైన ఆ శక్తులు ప్రధానంగా మూడు రకాలు. అవి ఆంతరంగిక శక్తి (యోగమాయ), బాహ్య శక్తి (మహామాయ), తటస్థ శక్తి (జీవాత్మలు).
రాధారాణి, సీతాదేవి, లక్ష్మీదేవి మొదలైన స్వరూపాలన్నీ భగవంతుని ఆంతరంగిక శక్తి అయిన యోగమాయకు చెందినవి. దుర్గ, కాళి మొదలైన అమ్మవారి స్వరూపాలు భగవంతుని బాహ్య శక్తి అయిన మహామాయకు చెందినవి. ఇక జీవాత్మలైన మానవులు, వృక్షాలు, పశుపక్ష్యాదులు మొదలైనవన్నీ భగవంతుని తటస్థ శక్తి స్వరూపాలు. ఈ భౌతిక ప్రపంచం కూడా భగవంతుని బాహ్యశక్తి ద్వారా వ్యక్తమైనదే. ఈ సృష్టిలోని పర్వతాలు, మహా సముద్రాలు, వనాలు, దేశాలు, సమాజాలు, కుటుంబాలు, వివిధ వైవిధ్యాలన్నీ మహామాయ జనితాలే!
శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తన ఆంతరంగిక శక్తితో, భౌతిక ప్రపంచాన్ని తన బాహ్య శక్తితో వ్యక్తపరుస్తాడు. తటస్థ శక్తికి చెందిన జీవాత్మలకు ఆంతరంగిక శక్తి, బాహ్య శక్తుల్లో దేన్నయినా ఆశ్రయించే వెసులుబాటు ఉంటుంది. అయితే, మహామాయ ప్రభావంతో జీవాత్మలు తమకు భగవంతుడితో గల సంబంధాన్ని మరచి తాపత్రయాలకు లోనవుతుంటాయి. జీవుడి ఉన్నతమైన ధర్మాన్ని, స్వరూప స్థితిని గుర్తుచేసేందుకు భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తాడు. సత్-చిత్-ఆనందమయమైన మన నిజ స్వరూపాన్ని, తాపత్రయ రహితమైన ఆధ్యాత్మిక ప్రపంచపు ఉన్నత ప్రకృతి గురించి మనకు గుర్తుచేస్తాడు. స్వయం సంకల్పంతో, యోగమాయతో ఈ లోకంలో అవతరించే భగవంతుడు ఎన్నడూ మనలా మహామాయకు వశుడు కాడు. ఇదే భగవంతుడి సర్వోన్నత తత్తం. భగవంతుడి అసంఖ్యాక లీలలన్నీ యోగమాయతో చేసినవే. అత్యంత శక్తిమంతమైన ఈ యోగమాయ మన మేధస్సుకు అంతుచిక్కనంత అచింత్యమైనది కూడా! శ్రీకృష్ణుడి లీలా స్మరణం, మననం ముక్తికి సోపానాలు. శ్రీకృష్ణ భగవానుడు చూపిన దివ్య లీలలన్నీ ఈ భౌతిక ప్రకృతి నియమాలకు అతీతమైనవి. ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే, ముక్తిపథంలో ప్రయాణం ప్రారంభించినట్టే.
దామోదర లీల
‘దామ’ అంటే తాడు, ‘ఉదర’ అంటే పొట్ట. తల్లి యశోద తాడుతో చిన్నికృష్ణుడి పొట్టను కట్టివేసినప్పుడు ఆయన చూపిన మాయే దామోదర లీలగా ప్రసిద్ధి చెందింది. యశోదమ్మ వెన్న చేయదలచి పెరుగును చిలుకుతున్న సమయంలో కన్నయ్య పాలకోసం తల్లి దగ్గరికి వస్తాడు. ఆమె ఎంతో ఆప్యాయతతో నల్లనయ్యను ఒడిలో పడుకోబెట్టుకొని పాలు పడుతుంటుంది. అదే సమయంలో కృష్ణుడి కోసం ప్రత్యేకంగా పద్మగంధీ గోవుల నుంచి సేకరించిన పాలు వంటగదిలో పొయ్యిపై పొంగిపోతాయి. యశోదమ్మ ఒక్కసారిగా బాలకృష్ణుణ్ని ఒడిలోంచి కిందికి దింపి లోనికి పరుగెత్తుతుంది. కృష్ణుడికి కాస్తా కోపమొచ్చేస్తుంది. అక్కడున్న రాయిని తీసుకొని వెన్న కుండపైకి విసరటంతో, ఒక కుండ మరోకుండపై పడి అలా అన్ని కుండలూ పగిలి వాటిలోని పాలు, పెరుగు, వెన్న ఇల్లంతా చిందరవందరగా ఒలికిపోతాయి. చేసిందంతా చేసి, అమ్మ తనను మందలిస్తుందనే భయంతో చేత దొరికినంత వెన్న పుచ్చుకొని దూరంగా పరుగెత్తి కోతులకు పంచిపెడుతూ తానూ ఆస్వాదించసాగాడు. వంటింటి నుంచి బయటికి వచ్చిన యశోదమ్మ గదిలో దృశ్యం చూసి కృష్ణుడిని వెంబడిస్తుంది. అమ్మకు చిక్కకుండా పరుగులు తీస్తుంటాడు. చివరికి అలసిపోతున్న అమ్మకు పట్టుబడతాడు. కొడుకు అల్లరికి కళ్లెం వేయడానికి కృష్ణుడిని రోలుకు కట్టేందుకు ప్రయత్నిస్తుంది యశోద. బాలకృష్ణుడి చిన్నిపొట్టను కట్టేయడానికి ఎంత పెద్ద తాడు తెచ్చినా సరిపోదు. ఎన్నిసార్లు ముడివేసినా, ప్రతిసారీ రెండు అంగుళాల తాడు తక్కువ పడుతుంది. విసిగి వేసారిపోతుంది యశోద. చివరికి తల్లిపై జాలితో కృష్ణుడు తాడుకు కట్టుబడతాడు. తర్వాత రోలు సహా అంబాడుతూ వృక్షరూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగిస్తాడు దామోదరుడు. శ్రీకృష్ణుడు తన యోగమాయతో చూపిన లీల ఇది.
గోవర్ధన లీల
శ్రీకృష్ణుడు బృందావనంలో ఏడేండ్ల బాలుడిగా ఉన్నప్పుడే గోవర్ధన లీల జరిగింది. బ్రజ్వాసులపై కృద్ధుడైన ఇంద్రుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్ష బీభత్సంతో బృందావనాన్ని ముంచెత్తుతాడు. ఆపదలో ఉన్న తన భక్తులను కాపాడేందుకు 22 మైళ్ల చుట్టుకొలతతో ఉన్న గోవర్ధన గిరిని చిటికెన వేలుతో ఛత్రంలా ఎత్తిపట్టి బృందావనంలోని సమస్త ప్రాణులకూ రక్షణ కల్పించాడు భగవానుడు. ఒక ఏడేండ్ల పిల్లవాడు ఎడమచేతి చిటికెన వేలిపై ఒక భారీ పర్వతాన్ని ఏడు రోజులపాటు నిరంతరాయంగా ఎలా ఎత్తిపట్టగలడు? ఇదే శ్రీకృష్ణుడి యోగమాయ ప్రదర్శన. భగవంతుడికి అది తేలికైన పనే అయినా, మనకు మాత్రం సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది.భగవంతుణ్ని రాధాకృష్ణులుగా, సీతారాములుగా, లక్ష్మీ నరసింహులుగా యోగమాయ సహితంగా ఆరాధించటమే పరిపూర్ణమైన ఆరాధన.
యోగ మాయావృతమైన ఆధ్యాత్మిక జీవనం ఎంత గొప్పగా ఉంటుందో చూపేందుకు అనేక లీలలను చూపాడు కృష్ణుడు. ఆ దేవదేవుడి అనుగ్రహం కోసం శ్రీకృష్ణుడి మధుర లీలా సమాహారమైన శ్రీమద్భాగవతాన్ని ప్రతిరోజూ పఠించాలి. ప్రతిరోజూ భగవంతుడి నామం జపించడం ద్వారా మహామాయ ప్రభావం నుంచి విముక్తి కలిగి, యోగమాయ ఆశ్రయంలో దివ్య ఆనందానుభూతి చెందగలం. పరమ పవిత్రమైన జన్మాష్టమి సందర్భంగా ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరేరామ హరేరామ రామ రామ హరే హరే’ దివ్యమంత్రాన్ని జపించాలి. రోజూ ఒక్క జపమాలతో (108 సార్లు) మొదలుపెట్టి, క్రమంగా 16 జపమాలలు జపించే స్థాయికి చేరుకుంటే కృష్ణుడి దివ్యత్వాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెంది, అందులోని ఆనందాన్ని
ఆస్వాదించగలుగుతాం.
-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి , 93969 56984