వేదాలను కాపాడినవాడు. జ్ఞానానికి మూలమైనవాడు. లలితా సహస్రనామాలను అనుగ్రహించినవాడు. శ్రీహరి దివ్య అవతారమైనవాడు. శ్రావణ పౌర్ణమినాడు ప్రభవించిన వేదమూర్తి. పున్నమిలాంటి తెల్లని రూపంతో, పుణ్యం పంచిన చల్లని దేవుడు హయగ్రీవుడు.
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే॥
‘అనంతమైన, ఆనందమయమైన జ్ఞానానికి అధిపతి, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి, సకల విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవుడికి నమస్కరిస్తున్నాను’ అని పై శ్లోకానికి అర్థం. ఎవరీ హయగ్రీవుడు? ఎందుకు ఆయన్ను ఉపాసించాలి?
శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. ఈ అవతారంలో స్వామి వేదాలను ఉద్ధరించారు. అందువల్ల, వేదాలతోపాటు సమస్తమైన వాఙ్మయానికి, జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయ్యాడు. ఈ అవతారంలో స్వామి గుర్రం ముఖం, మానవ శరీరం కలిసిన రూపంలో దర్శనమిస్తాడు. స్వామి వామాంకం మీద లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది. స్వామిది తెల్లటి శరీర ఛాయ. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, చిన్ముద్ర, పుస్తకాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.
వేద రక్షకుడు
శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. దేవీభాగవతం, స్కందపురాణం, భాగవతం వంటి పురాణాల్లో హయగ్రీవ అవతారానికి సంబంధించి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. మధుకైటభులనే రాక్షసులు వేదాలను అపహరించి, పాతాళంలో దాచిపెడతారు. వేదాలు లేనిదే సృష్టికార్యం చేయలేనని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి విన్నవించుకుంటాడు. వెంటనే, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారంలో పాతాళానికి చేరి, మధుకైటభులను వధించి, వేదాలను రక్షించి, బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.
మరొక కథ ప్రకారం, దానవులతో యుద్ధం చేసి అలసిన విష్ణువు అల్లెతాడును (నారితాడు) గడ్డం కింద ఉంచుకొని నిద్రపోతుంటాడు. దేవతల కోరిక మేరకు, శివుడు భ్రమర రూపం ధరించి, అల్లెతాటిని కొరుకుతాడు. చివాలున తెగిన అల్లెతాటి వేగానికి విష్ణువు శిరస్సు శరీరం నుంచి వేరుపడుతుంది. విచారించిన దేవతలు, గుర్రపు తల తీసుకువచ్చి, విష్ణువుకు అతికించి, ఆయనను పునర్జీవితుడిని చేస్తారు. ఈ విధంగా స్వామి హయగ్రీవుడు అయ్యాడు. ఇంకా, మరెన్నో కథలు హయగ్రీవ అవతారోత్పత్తి గురించిన విశేషాలను మనకు తెలియజేస్తాయి.
సకల విద్యలకు అధిదేవుడు
హయగ్రీవుడు పరిపూర్ణ వేదమూర్తి. స్వామి రూపం సకల విద్యలకు నిలయంగా భాసిస్తుంది. అంతేకాదు, హయగ్రీవుడు సకల దేవతాస్వరూపం కూడా. ఆయనవల్లనే ఈ లోకానికి లలితా సహస్రనామం, దుర్గా త్రిశతి మొదలైన విద్యలు అందాయి. సాక్షాత్తు హయగ్రీవస్వామి అగస్త్య మహర్షికి శక్తి ఉపాసనా రహస్యాలను బోధించినట్లు బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లలితా సహస్రనామాలు హయగ్రీవుడి వల్లే లోకంలో వ్యాప్తిచెందాయి. అంతేకాదు, సకల మంత్రతంత్రాలకు సైతం హయగ్రీవుడు అధిపతి అని బ్రహ్మాండాది పురాణాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. మహోన్నత అవతారమూర్తి అయిన హయగ్రీవస్వామిని అర్చించిన ఎందరో రుషులు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి, ఆ విజ్ఞానాన్ని సమాజ పునరుద్ధరణ కోసం వినియోగించారు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన ఆదిశంకరులు, విశిష్టాద్వైత మత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు హయగ్రీవ ఉపాసనతో సర్వోన్నత జ్ఞానాన్ని సంపాదించారని చెబుతారు. హయగ్రీవ ఉపాసన పుణ్యఫలితం వల్ల ‘శ్రీపాద రాజతీర్థుల’నే పండితుడు రాజాస్థానంలో జరిగిన పండిత సభలో విజయం సాధించాడు. దుష్టమంత్ర ప్రభావం వల్ల శ్రీపాదుడికి కలిగిన వాగ్బంధనం కూడా హయగ్రీవ ఉపాసన వల్ల తొలగిపోయింది. గాలవుడనే మహర్షి హయగ్రీవ ఉపాసనతో వేద పారంగతుడు అయ్యాడని మహాభారతం చెబుతున్నది. సూర్యుడితో సహా దేవతలందరూ హయగ్రీవుడి ఉపాసన చేసినట్లు హయగ్రీవ ఉపనిషత్ చెబుతున్నది.
హయగ్రీవస్తుతి
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వా దినం
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః॥
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్ను కన్యా ప్రవాహవత్
హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః
విశోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః॥
శ్లోకత్రయమిదం దివ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం ప్రదం॥
ఈ హయగ్రీవస్తుతిని నిశ్చలబుద్ధితో పారాయణం చేసినవారికి సకల విద్యాబుద్ధులు కలుగుతాయని శాస్త్రవచనం. హయగ్రీవోత్పత్తి జరిగిన శ్రావణ పౌర్ణమి నాడు మహావిష్ణువును హయగ్రీవమూర్తిగా అర్చించి, శనగలు, ఉలవలు, గుగ్గిళ్లు నివేదన చేయాలి. ప్రత్యేకించి, విద్యార్థులు నిత్యం హయగ్రీవ స్తోత్రాన్ని పఠించడం వల్ల స్వామి అనుగ్రహ ఫలితంగా ఉత్తమ విద్య
లభిస్తుంది.
హయగ్రీవ క్షేత్రాలు
సకల విద్యాధినాయకుడైన హయగ్రీవుడి ఆలయాలన్నీ శక్తిమంతమైనవిగా ప్రసిద్ధిపొందాయి. శ్రీరంగం, కంచి, తిరువేండి క్షేత్రాల్లో హయగ్రీవస్వామి ఆలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గొల్లప్రోలు సమీపంలో కూడా ఒక ఆలయం ఉంది. అసోం రాజధాని గువాహటి సమీపంలో ఉన్న ‘హజో’ అనే ప్రాంతంలోని ఓ పర్వతంపై హయగ్రీవ ఆలయం ఉంది. ఇక్కడ స్వామి ‘హయగ్రీవమాధవుడి’గా పూజలు అందుకుంటున్నాడు.
-డా॥ కప్పగంతు రామకృష్ణ