భోగైశ్వర్య ప్రసక్తానాం త యాపహృత చేతసామ్
వ్యవసాయిత్మికా బుద్ధిః సమాధౌ నవిధీయతే॥ (2-44)
మనిషిలో భోగాసక్తత, ఐశ్వర్య కాంక్ష మొదలైనవి ఉన్నప్పుడు బుద్ధి అతని అధీనంలో ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు ఈ విషయంలో అర్జునుడిని హెచ్చరిస్తూ ‘భోగాల్లో కాని, ఐశ్వర్యంపై కాని అమితమైన ఆసక్తి కలిగినవారికి, వాటికి సంబంధించిన తియ్యని మాటలకు ప్రభావితులైనవారు తమ బుద్ధిని, జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. అలాంటివారి మనసులో బుద్ధి నిశ్చయత ఉండదు. బుద్ధికి స్థిరత్వం ఉండదు’ అని చెప్పడం కేవలం అర్జునుడికే కాదు, సమస్త మానవజాతికి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశం.
భోగలాలసత, ఐశ్వర్యదాహం వంటి అంశాలు మానవ జీవితాన్ని కష్టాలపాలు చేస్తాయి. కర్తవ్య నిర్వహణ ధర్మబద్ధంగా చేయకుండా ఉండేవిధంగా అలసత్వానికి గురిచేస్తాయి. అంతేకాదు, ఒకానొక దశలో మానవ ప్రగతికి, సమాజ సంక్షేమానికి అడ్డుపడేటట్లు చేసి స్వార్థబుద్ధిని కలిగిస్తాయి. మనిషి జీవితాన్నే ప్రమాదంలోకి తోసేసే అవకాశం కూడా ఉంటుంది. జ్ఞానమార్గంలో సాగాల్సిన వ్యక్తిని, జీవితాన్ని నియమబద్ధం చేసుకొని.. తనను తాను సంస్కరించుకోవలసిన వ్యక్తిని ఈ రెండూ విపరీతంగా ప్రభావితం చేసి తప్పుడు మార్గంలో వెళ్లేవిధంగా ప్రోత్సహిస్తాయి. మనిషి స్వభావాన్నే మార్చి అతణ్ని క్రూరునిగా తయారుచేస్తాయి. ఆ క్రూరకర్మలు ప్రపంచాన్ని పలు బాధలకు లోనుచేస్తాయి.
తానొక్కడే కావచ్చు, కానీ తన కోరికలు అంతులేనంతగా పెరిగిపోవడానికి ఈ భోగవాదం, ఐశ్వర్యవాంఛ దోహదం చేస్తాయనడం అక్షర సత్యం. భోగవాంఛలు, ఐశ్వర్యకాంక్షలు ఒకసారి మనసులో ప్రవేశిస్తే చాలు క్రమంగా అవి మొత్తం మనసంతా ఆక్రమిస్తాయి. మనిషి నిలువెల్లా తన భోగాలను గురించి, తన ఐశ్వర్యాలను గురించే తప్ప మరొక విషయం ఆలోచించడు. వాటిని గురించి అవసరం అనుకుంటే అధర్మ మార్గంలో, అవినీతి మార్గంలోకి కూడా పోవడానికి వెనకాడడు. దానికోసం ఇతరులను హింసించే ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. జ్ఞాన, ధర్మమార్గాల గురించి ఆలోచించాలనే స్పృహ లేకపోవడంతో ఎంతటి విద్యావంతుడైనా పతనమవడం మొదలవుతుంది. తాను సాధించిన జ్ఞానమంతా ఏ మాత్రం ఉపయోగపడకుండా వృథా అయిపోతుంది. అన్ని అనర్థాలకు అది మూలం అవుతుంది. ఉత్తమ జీవితాన్ని సాధించాలనే కాంక్ష కూడా ఉండదు. మనసంతా దుష్టభావన పూరితమైతన ఆప్తులకైనా, తన సమాజానికైనా నష్టం చేయడానికి వెనకాడని మనస్తత్వం పెరుగుతుంది. భోగం, ఐశ్వర్యం శాశ్వతం కాదు. ఇవి మోక్ష సాధనకు అవరోధాలు. అన్ని సత్యాలను విస్మరించి తనకు తానే అన్యాయం చేసుకునే స్థితికి దిగజారుతాడు.
‘వ్యవసాయాత్మక’మైన బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి పూర్తిగా నశిస్తుందన్న భగవానుడి బోధను గమనిస్తే ఒకవిధంగా మనిషి ఏ నిర్ణయాన్నీ నిశ్చయమైన రీతిలో తీసుకోలేడన్నది అర్థమవుతుంది. తానే సందేహాత్మకమైన అంతరంగం కలిగి ఎటువంటి స్థిర నిర్ణయం తీసుకోలేక నశించిపోతాడన్నది దీని అంతరార్థం. నిశ్చయబుద్ధి వ్యక్తి లో స్థిరత్వాన్ని కలిగిస్తుంది. తన కర్తవ్య నిర్వహణలో ఎటువంటి అవరోధాలనైనా అధిగమించగలిగే మానసిక శక్తిని అందిస్తుంది. దానివల్ల తన జీవితంలో ఎన్ని విజయాలైనా అతను సాధించగలడు. భోగమైనా ఐశ్వర్యమైనా మనసులో తీయని భావాలను కలిగిస్తాయి. కానీ, ఆ తీయదనానికి మనం లొంగిపోతే, మన మనసు ఆ ఆకర్షణలో పడిపోతే కోలుకోవడానికి సాధ్యం కాదు. పైగా తీవ్రనష్టాన్ని, అమితమైన వేదనను కూడా అనుభవించవలసి వస్తుంది. ప్రపంచంలో ప్రతివ్యక్తికీ అన్వయించే గొప్ప గొప్ప విషయాలను బోధించే భగవద్గీత వ్యక్తుల్లో ఉత్తమోత్తమ గుణాలను పెంచి, విశ్వమానవ పురోగతికి మార్గం చూపిన మహోన్నత గ్రంథం. ఇది మానవహిత గ్రంథం అన్న ప్రశస్తికి అన్నివిధాలా అర్హమైనది.
-గన్నమరాజు గిరిజా మనోహరబాబు