పూర్వం నృగ మహారాజు అనే గొప్ప దాత ఉండేవాడు. ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. నిరంతరం గో దానం చేసేవాడు. నవనీతం వంటి హృదయం ఆయనది. ఎవరికీ ఏ కష్టం కలగకుండా ప్రజలను పాలించేవాడు. ఓ సారి ఆయన వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. ఒకరికి దానం చేసిన గోవునే మళ్లీ మరో బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. ‘గోవు నాదంటే నాద’ని ఆ విప్రులిద్దరూ తగవులాడుకున్నారు. చివరికి రాజుగారినే అడుగుదామనుకొని ఇద్దరూ నృగ మహారాజు దగ్గరికి వెళ్లారు. వాళ్ల తగాదా విని రాజు విచారపడ్డాడు. తనవల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాడు. ‘అయ్యా! దీన్ని ముందు మీకిచ్చినమాట నిజమే. ఇది మా ఆవులతో కలిసి మేస్తుంటే, మాదేననుకుని గోపాలకులు తీసుకువచ్చారు! తెలియక నేను దాన్ని మళ్లీ ఈయనకు దానమిచ్చాను. పొరపాటుకు క్షమించండి. మీకు మంచి గోవులు నూరువేలిస్తాను. ఈ ఆవును ఆయనకు ఇచ్చేయండి’ అన్నాడు మొదటి బ్రాహ్మణుడితో. ‘మహారాజా! ఇది చాలా శ్రేష్ఠమైన ఆవు. నా కుమారుడు పాల కోసం ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు తీసుకోనిస్తుంది. అంత మంచి స్వభావం దీనిది! ఈ ఆవు నా ఇంట్లో లక్ష్మిలా ఉంటే నాకు సంతోషం కానీ, నువ్వు కోటి గోవులిచ్చినా తీసుకోను’ అని వెళ్లిపోయాడా బ్రాహ్మణుడు. ‘అయ్యా! మీరు కోరినన్ని రత్నాలూ, మణులూ, గోవులూ ఇస్తాను. ఈ ఆవును ఆయనకు ఇవ్వండి’ అని మహారాజు రెండో వ్యక్తిని వేడుకున్నాడు. ‘ఈ ఆవు తప్ప నాకు నీ రాజ్యమంతా ధారపోసినా అక్కర్లేదు’ అని మొండిగా ఆ ఆవును తీసుకొని వెళ్లిపోయాడతను.
కొన్నాళ్లకు నృగ మహారాజు కాలం చేశాడు. యమ భటులు యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్లారు. ‘మహారాజా! ఎన్నో పుణ్యకార్యాలు చేశావు. కానీ ఒకరికిచ్చిన గోవునే మరొకరికి దానం ఇచ్చి పొరపాటు చేశావు. విప్రుని మనసు కలతపెట్టావు. అందుకే కొంత పాపం సంప్రాప్తించింది. ముందు పాపం అనుభవిస్తావా? పుణ్యం అనుభవిస్తావా?’ అని యముడు ప్రశ్నించాడు. ‘పాపమే అనుభవిస్తాను’ అన్నాడు రాజు. వెంటనే తలకిందులుగా భూమ్మీద పడ్డాడు. పడుతూ పడుతూ ఉండగా ‘విచారించకు. కొన్నాళ్లయ్యాక వాసుదేవుడు వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు. అప్పుడు నీకు శాశ్వత సౌఖ్యం కలుగుతుంది’ అన్నాడు యమ ధర్మరాజు.
నృగుడు భూమ్మీద తొండ రూపంలో తిరగసాగాడు. చాలా రోజులు గడిచాక ఒకనాడు విధి వశాత్తు ఒక నూతిలో చేరాడు. ఆ నూతిలోకి వచ్చిన మరు క్షణంలోనే అతని శరీరం విపరీతంగా పెరిగిపోయింది. యమ ధర్మరాజు అనుగ్రహం వల్ల అతనికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. తనను చూసుకొని తానే ఆశ్చర్యపడ్డాడు. బావి దగ్గరికి వచ్చిన ప్రజలు ఆ తొండను చూసి, ‘ఇది ఇందులో ఉంటే నీళ్లు పాడైపోతాయి’ అనుకొని పెద్ద పెద్ద తాళ్లు తెచ్చి దానికి కట్టి పైకి లాగబోయారు. కానీ అది కదిల్తేగా! వాళ్లకు భయం, ఆశ్చర్యం కలిగాయి. గబ గబా వెళ్లి సంగతంతా కృష్ణ భగవానుడితో చెప్పారు. ఆయన వెంటనే ఆ బావి దగ్గరికి వచ్చి తొండను బయటికి తీశాడు. అప్పుడు నృగుడు దివ్యరూపం ధరించి ఉత్తమ లోకాలకు వెళ్లిపోయాడు. ‘కృష్ణ స్పర్శ వల్ల నృగుడికి ఉత్తమగతి కలిగినట్టే, సజ్జన సాంగత్యం వల్ల సర్వసుఖాలు కలుగుతాయి’ అని మాంధాతృడికి బృహస్పతి చెప్పినట్టు మహాభారతంలో ఉన్నది.
దేవతలకు అమృతాన్ని ఆహారంగా ఇచ్చాడు బ్రహ్మ. ఆ అమృత పరిమళం నుంచి సురభి అనే ఆవు పుట్టింది. దాని సంతానం సౌరభేయులు. ఆ ఆవులన్నీ ఒకనాడు హిమవత్పర్వతం మీద సంచరిస్తూ ఉండగా, ఒక దూడ తల్లి దగ్గరికి వెళ్లి పాలు తాగడం మొదలుపెట్టింది. అప్పుడా పాలనురుగు గాలికి చెదిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడి శిరస్సు మీద పడింది. ఆయన కోపగించుకొని మూడోకన్ను తెరిచాడు. ఆ కంటి మంటల వేడి సోకి ఆ ఆవుల శరీరాలకు కపిల వర్ణం వచ్చింది. దాంతో అవన్నీ భయపడి అక్కడి నుంచి పారిపోయాయి. అప్పుడు బ్రహ్మ పరమేశ్వరుణ్ని ప్రార్థించి ప్రసన్నుణ్ని చేశాడు. ఒక మంచి ఎద్దును కానుకగా ఇచ్చాడు. అప్పటినుంచీ ధూర్జటికి నంది వాహనమైంది. శివుడి ధ్వజం మీద కూడా వృషభ చిహ్నం ఉంటుంది. శివుడు ప్రసన్నుడు కావడంతో ఆవులన్నీ మళ్లీ ఆ పర్వతం మీదికి వచ్చాయి. వాటిని చూసి అవి సర్వత్రా సంచరించగలవిగానూ, మిగిలిన గోవుల కంటే కపిల గోవులకు ఉత్తమత్వం కలిగేటట్టుగాను వరమిచ్చాడు శివుడు. నేటికీ గోవులను లక్ష్మీ స్వరూపాలుగా ఆరాధించటం, గో పంచకాన్ని పవిత్రమైనదిగా భావించటం జరుగుతున్నది. భోజనం చేసేముందు గోవులకు గుప్పెడు పచ్చిక వేస్తే కొండంత పుణ్యమని మనవాళ్లు భావిస్తారు.
-ప్రయాగ రామకృష్ణ