తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల అర్బన్ ఎస్పీతో కలిసి తిరుమల చీఫ్ విజిలెన్స్ అధికారి మాఢ వీధులను పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి.
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కలిసి పరిశీలించారు. కరోనా వ్యాప్తి కారణంగా రెండేండ్లుగా బ్రహ్మోత్సవాల సందర్భంగా మాఢ వీధుల్లో శ్రీవారి వాహన సేవలను నిలిపి వేశారు. మాఢ వీధుల పరిశీలన అనంతరం టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. తొలి విడతగా పరిశీలన చేపట్టామని, మరిన్ని సార్లు పరిశీలన చేపట్టి కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. వీరి వెంట టీటీడీ ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, ఈఈ జగన్ మోహన్ రెడ్డి, తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీఓ బాలిరెడ్డి, తదితర టీటీడీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.