తిరుపతి : శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య తిరుగాడిన ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. విగ్రహం వద్ద శ్రీవారి ఆలయాన్ని నిర్మించి అర్చకుడు, భద్రత, ఇతర సిబ్బందిని నియమిస్తామన్నారు. ప్రతిరోజు ఇక్కడ అన్నమయ్య సంకీర్తనలు వినిపించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేస్తామని, వాస్తు ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రాంగణంలోని అన్నమయ్య విగ్రహానికి రంగులు, నిత్య సంగీత కార్యక్రమాలు, పచ్చదనాన్ని పెంపొందించి తాళ్లపాకకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ ప్రాంగణంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని సుబ్బారెడ్డి చెప్పారు. తాళ్లపాకలో కూడా అభివృద్ధి పనులకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత టీటీడీలో విలీనం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అన్నమయ్య మార్గాన్ని నడక, వాహనాలల్లో వెళ్లేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని చైర్మన్ సందర్శించి పూజల్లో పాల్గొన్నారు. నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన వెంట టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.