విజయనగర రాయల కాలపు శిల్పకళలో వెన్నముద్ద కృష్ణుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. వెన్నముద్ద కృష్ణుణ్ని ఉత్తర భారతదేశంలో ముద్దుగా ‘లడ్డూ గోపాల్’ అని పిలుచుకుంటారు. చేతిలో వెన్నముద్దతో దోగాడే భంగిమలో ఉన్న చిన్ని కృష్ణుడి చిత్రం ఇంట్లో ఎదురుగా ఉంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. రేపల్లెలో యశోదమ్మ చల్ల చిలుకుతున్న సమయంలో కృష్ణుడు ఆమె వెనుకనే ఉండేవాడు. దాంతో మీగడ, పెరుగును చిలుకుతూ తన ముద్దుల పట్టికి దేవతలు, దానవులు కలిసి పాల సముద్రాన్ని చిలికే కథతోపాటు మరెన్నో కథలు చెప్పి ఆనందాశ్చర్యాలలో ముంచెత్తేది. ఈలోపు మజ్జిగ చేయడం, వెన్న తీయడం పూర్తయ్యేవి. వెన్నలో కొంతభాగం వెన్నుడికి పెట్టడమూ అంతే సహజంగా జరిగిపోయేది. అలా బాలకృష్ణుడు వెన్న అంటే ఇష్టం పెంచుకున్నాడు.
పెరుగుతున్న క్రమంలో వెన్న కోసం ఏదైనా సరే చేసేవాడు చిన్ని కృష్ణుడు. చెప్పకుండా వెన్న తింటున్నాడని యశోదమ్మ ఉట్టి మీద పెట్టేది. అప్పుడు రోలు వేసుకొని ఉట్టిని అందుకునే ప్రయత్నం చేసేవాడు. అందుకోలేకపోతే పక్కనే ఉన్న పీటలు రోలు మీద వేసుకునేవాడు. ఇంకొంచెం ఎత్తు పెంచితే గోపబాలురను నిచ్చెనగా చేసుకొని ఉట్టిని అందుకునేవాడు. తాను తిని అన్న బలరాముడు సహా తన సహచరులకు తప్పకుండా పెట్టేవాడు. కొంత తనను ఆశ్రయించిన కోతులకూ పంచేవాడు. రామాయణంలో కోతులు పరమాత్ముడికి సేవకులు, ద్వాపరయుగంలో మాత్రం అనుచరులు. ఉట్టి అందుకోవడానికి గోపబాలురను నిచ్చెనగా చేసుకున్న సందర్భమే ఇప్పుడు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉట్లు కొట్టే వేడుకలకు నేపథ్యంగా నిలిచింది. ఇక వీధుల్లో ఆడుకోవడం, పశువులను కాయడం మొదలుపెట్టిన తర్వాత రేపల్లెలోని గొల్లల ఇళ్లలో కృష్ణుడు వెన్న తినడానికి చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. దీనినే ‘ఓ యమ్మ నీ కుమారుడు, మా ఇండ్లను పాలుపెరుగు మననీడమ్మా..’ అని గోపికలు ‘మా తండ్రులు, దేవుండ్ల మీద ఒట్టు తల్లీ! ఎక్కడికైనా వెళ్లిపోతాం’ అని యశోదమ్మతో వాసుదేవుడి మీద ఫిర్యాదు చేసినట్లు పోతన భాగవతంలో వర్ణించాడు. అలా కృష్ణుడు వెన్నదొంగ- మాఖన్చోర్గా ప్రసిద్ధి చెందాడు.
మామూలుగా చూస్తే కృష్ణుడు వెన్న దొంగగానే కనిపిస్తాడు. మార్మికంగా పరిశీలిస్తే దీని అర్థం వేరేగా గోచరిస్తుంది. జన్మించిన ప్రతి మనిషీ మరణించే వరకు విద్యార్జన, వృత్తి మెళకువలు నేర్చుకోవడం, వివాహం, పిల్లలు, వారి పెంపకం, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, వార్ధక్యం, సుఖదుఃఖాది ద్వంద్వాలను అనుభవించాల్సి ఉంటుంది. అందుకే ఈదడానికి అత్యంత కష్టమైనది సంసార సాగరం అంటారు. మానవ జీవితంలోని ఈ క్రమం అంతా ఆవు నుంచి పాలు తీసుకొని, వాటిని కాచడం, పెరుగు తోడుపెట్టడం, మీగడ పక్కనపెట్టడం, మజ్జిగగా చిలకడం, వెన్న తీయడం, అంతిమంగా నెయ్యిగా మార్చడం వరకు ఎంతో ఓర్పుగా, నేర్పుతో చేయాల్సి ఉంటుంది. ఇందులో పెరుగును చిలుకుతున్నప్పుడు ఏర్పడే మజ్జిగ నీళ్లను సంసారానికి, అందులో తేలుతూ వచ్చే వెన్నను మనిషికి ప్రతీకలుగా భావిస్తారు. అలా సంసార సాగరంలోంచి మనిషిని పరమాత్ముడు తేలికగా దాటిస్తాడనే దృగ్విషయాన్ని మార్మికంగా చెప్పడమే కృష్ణుణ్ని వెన్నదొంగగా ప్రతీకాత్మకంగా చూపించడం.
అందుకే తిరుమల శ్రీవేంకటేశ్వరుణ్ణి ‘నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..’ అనే వైరాగ్య సంకీర్తనలో అన్నమయ్య చివరికి, ఆనంద ముద్రలో ఉండే కృష్ణుణ్ని ప్రతిష్ఠించి ‘నవనీత చోర శ్రీనారాయణా’ అని ప్రయోగించాడు. ‘వివిధాలైన బంధాల నుంచి మమ్మల్ని బయట పడేయకుండా, నన్ను సంసార సాగరంలో తడబడిపోయేలా ఎందుకు చేస్తావు? దేవతలచే వందితుడవైన శ్రీతిరువేంకటాద్రీశ, నవనీత చోర నారాయణా’ అని వేడుకుంటాడు. ఈ కీర్తన మనల్ని సంసారంలో పడవేసింది భగవంతుడే, కాబట్టి దాన్ని దాటించాల్సిందీ ఆయనే అని తీవ్ర వైరాగ్యాన్ని కోరుకుంటూ సాగుతుంది. ఇలాంటి సంకీర్తనలో మొదట ‘నగరాజధరుడా’ (గోవర్ధనగిరిని ఎత్తినవాడా) అని భారమైన పదప్రయోగం చేసిన అన్నమయ్య చివరికి వచ్చేసరికి నవ్వుమొగంతో ఉన్న ‘నవనీత చోరుడు’ అనే తేలికైన పదాలను ప్రయోగించాడు. అంటే ఇక్కడ ‘నవనీత చోరుడు’ అంటే భవసాగరాన్ని దాటించేవాడు అనే అర్థంలోనే కదా! అందుకే జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, సంసార యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకొని మోక్ష మార్గంలోకి వెళ్లాలన్నా మనకు పరమాత్ముడి అండ, అనుగ్రహం నిండుగా, మెండుగా ఉండాల్సిందే. ఇదే వెన్నముద్ద కృష్ణుడి కథ అంతరార్థం.
చింతపల్లి హర్షవర్ధన్