వేల సంవత్సరాల కిందట ఈజిప్ట్ను ఫిరౌన్ అనే చక్రవర్తి పాలించేవాడు. దుర్మార్గమైన విధానాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. ఆ నియంత పాలనలో ప్రజలకు దినదిన గండంగా గడిచేది. రాజ్యంలో తనను ప్రశ్నించేవాడు ఉండకూదని భావించాడు ఫిరౌన్. పిల్లలు పెద్దవారైతే తన రాచరికాన్ని ప్రశ్నిస్తారని అనుమానంతో… మగబిడ్డ పుడితే వెంటనే చంపేయమని సైనికులను ఆదేశించాడు. గర్భిణులపై నిఘాపెట్టి ఉంచేవారు సైనికులు.
మగపిల్లాడు పుడితే హతమార్చేవారు. అయితే, ఒక ఇల్లాలికి పండంటి మగబిడ్డ పుడతాడు. సైనికుల కండ్లుగప్పి మూడునెలలు బిడ్డను కాపాడుకొచ్చింది. బిడ్డ ఇంకా అక్కడే ఉంటే ప్రమాదమని దైవంపై భారం వేసి ఓ సాహసానికి పూనుకుంది. పసివాడిని బుట్టలో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టింది. నదీజలాలపై తేలియాడుతూ చాలా దూరం ప్రయాణించిన బుట్ట.. రాజభవనం ఆవరణలోని తోటలో తీరానికి చేరుకుంది. ఆ బుట్టను గమనించిన సేవకులు అందులో శిశువును మహారాణికి అప్పగించారు.
ఆ బాలుణ్ని చూడగానే రాణి మనసు ఉప్పొంగింది. శిశువు ఆలనాపాలనా చూసుకునే అవకాశం యాదృచ్ఛికంగా ఆ బాలుడి సొంత తల్లికే దక్కింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక ప్రవక్త మూసాగా ప్రసిద్ధి చెందాడు. ఫిరౌన్ చక్రవర్తి దుర్మార్గాలకు ఎదురుతిరిగాడు. వేలమంది సైన్యంతో తనపై దాడికి వచ్చిన ఫిరౌన్ను ప్రవక్త మూసా సముద్రంలో ముంచేశాడు. ప్రజలను ఈతిబాధలకు గురిచేసిన ఫిరౌన్ అల్లాహ్ శిక్షకు గురయ్యాడు. ఫిరౌన్ భార్య ఆసియాను అల్లాహ్ ఎంతో మెచ్చుకున్నాడు.
…? ముహమ్మద్ ముజాహిద్, 96406 22076