ఆలయ నిర్మాణంలో పంచాయతనం అంటే ఏమిటి?
ప్రాఙ్నిక్ దత్త. కూకట్పల్లి
దేవాలయం అంటే దైవీశక్తికి కేంద్రం. అందుకే ప్రత్యేకమైన విధివిధానాలతో, శాస్త్ర ప్రమాణాలతో దేవాలయాన్ని నిర్మిస్తారు, దేవతా విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఐదుగురు దేవతలతో శోభిల్లే ఆలయమే పంచాయతనం. సూర్యుడు, శివుడు, విష్ణువు, గణపతి, అమ్మవారు ఈ ఐదుగురు పంచాయతన దేవతలు. ఒక దేవత ప్రతిమను మధ్యలో ప్రతిష్ఠించి మిగతా మూర్తులను విదిక్కులలో కొలువుదీరుస్తారు. మధ్యలో ఉన్న దేవతామూర్తి పేరుతో పంచాయతనంగా పిలుస్తారు.
శివ పంచాయతనం: మధ్యలో శివుడు, ఈశాన్యంలో విష్ణుమూర్తి, ఆగ్నేయంలో సూర్యుడు, నైరుతిలో గణపతి, వాయవ్యంలో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు.
విష్ణు పంచాయతనం: మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం, ఈశాన్యంలో శివుడు, ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో సూర్యుడు, వాయవ్యంలో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు.
సూర్య పంచాయతనం: మధ్యలో సూర్యుడు, ఈశాన్యంలో శివుడు, ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో విష్ణుమూర్తి, వాయవ్యంలో దుర్గాదేవి విగ్రహాలను కొలువుదీరుస్తారు.
గణపతి పంచాయతనం: మధ్యలో వినాయకుడు, ఈశాన్యంలో విష్ణువు, ఆగ్నేయంలో శివుడు, నైరుతిలో సూర్యుడు, వాయవ్యంలో దేవీ విగ్రహాలు ఉంటాయి.
దేవీ పంచాయతనం: మధ్యలో అమ్మవారు వరుసగా విష్ణువు, శివుడు, గణపతి, సూర్యుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు.
చాలావరకు పంచాయతనం ఒకే గర్భగుడిలో ఉండేలా ప్రతిష్ఠిస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ ఉపాలయాలు నిర్మించినా ఇదే పద్ధతిని అనుసరిస్తారు.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370