కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాంతం
అద్యైనమే విశతు మానస రాజహంసః
ప్రాణ ప్రయాణ సమయే కఫ వాత పిత్తైః
కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే
‘హే కృష్ణా! నీ పాదపద్మాలు అనే పంజరంలో నా మనసు అనే రాజహంస ఇప్పుడే ప్రవేశించు గాక! ఎందుకంటే, ప్రాణ ప్రయాణ సమయంలో కఫ, వాత, పిత్తములు ప్రకోపించి గొంతుకు అడ్డుపడితే నిన్ను ఎలా స్మరించగలను?’ అని ముకుందమాల స్తోత్రంలో మహాభక్త కవి శ్రీకులశేఖరాళ్వారులు ప్రార్థించారు.
అసలు మనసు ఎక్కడ నిలవాలో అర్థం చేసుకోవాలి. డబ్బు మీదా! పేరు మీదా! పదవుల మీదా! ఆస్తిపాస్తుల మీదా! ఐహిక సుఖభోగాల మీదా! ఒక్క భగవంతుడి మీద తప్ప వీటన్నిటి మీదా మనసును ప్రయత్నపూర్వకంగా నిలపవలసిన పనే లేదు. దానంతట అదే నిలుస్తుంది. పైగా అక్కడి నుంచి కదలనని మొరాయిస్తుంది. చిత్రమేమంటే ఇవన్నీ అశాశ్వతాలే! మూడునాళ్ల ముచ్చటలే! అశాశ్వతాలన్న విషయం కూడా మనసుకు తెలుసు! కానీ, వాటియందు రమించడం మాత్రం మానుకోనంటుంది. అదే మనసు లక్షణం. మొత్తమ్మీద మనసు ఎక్కడో కాకుండా కృష్ణుడి మీదే అంటే, భగవంతుడి మీద నిలపవలసి ఉన్నదని స్పష్టమవుతున్నది. ముందు మనం దాన్ని నిశ్చలంగా తయారుచేసుకోవాలి. కానీ, మనసుకు హడావుడి పడటం, ఆరాటపడటం అలవాటు చేస్తున్నాం. ‘ఏదైతే ఏముందిలే!’ అని నేర్పలేదు. ఆశలు మానుకోవడం నేర్పలేదు. ఇక అది నిశ్చలంగా ఎలా తయారవుతుంది?
‘మనసును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది. లేదంటే నిన్ను భ్రమలోనే ముంచేస్తుంది’ అంటారు ఆదిశంకరాచార్యులు. ఇప్పుడు జరుగుతున్నది అదే! ఏదేమైనా శ్రీకృష్ణుడి పాదపద్మాలపై స్థిరంగా లగ్నమైన మనసును ఏ ప్రలోభాలూ ఆకర్షించలేవు. లగ్నం కాకపోతే ఏం జరుగుతుంది? డబ్బు కోసం పరుగెత్తుదామా? పేరు కోసం పరుగెత్తుదామా? అని ఎన్నోరకాల వాటికోసం ఆరాటపడి పరుగులు తీస్తూ ఉంటుంది. అలా పరుగులు తీస్తున్నదంటే, కృష్ణుడి పాదాల చెంత స్థిరత్వం లభించలేదన్నమాట. అలాంటప్పుడు తక్కినవెన్నో ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ, ఉన్నదొక్కటే అని భావించాలి. అదే భగవంతుడు. మనసు ఎన్నో ఎన్నో అనుకున్నంత కాలం, మరెన్నో జన్మలు గడుస్తూనే ఉంటాయి. పునరపి జననం- పునరపి మరణం అంటే ఇదే! కానీ, ఒక్కటే అని స్థిరంగా నిశ్చయించుకుంటే.. ఒక్క జన్మలోనే అంతా అయిపోతుంది. అదీ తమాషా!
భగవంతుడి నామం స్మరించమని చెప్తే, దానికి ఇంకా చాలా సమయం ఉందంటారు. ప్రాణం పోయే సమయంలో భగవన్నామం స్మరించవచ్చులే అని భావిస్తారు చాలామంది. భగవద్రతిలోని మధురానుభవం రుచి చూడకపోవడం వల్ల కలిగిన అమాయకత్వమే దానికి కారణం. అయితే, ప్రాణం పోయే సమయంలో దైవనామ స్మరణ మనం అనుకున్నంత తేలిక కాదు. అప్పుడు ప్రాణాల మీద ఎక్కడ లేని ప్రీతి పుట్టుకొస్తుంది. ప్రాణాలు పోకుండా ఎలా నిలబడతాయో అన్నదే ప్రధాన చింత అవుతుంది. దాన్ని పక్కకు తప్పిస్తే కదా భగవన్నామ స్మరణం! ఇంతకుముందు ఎంతో కొంత సాధన చేసి ఉంటే తప్ప మృత్యు ఘడియలో భగవంతుడు గుర్తుకురాడు. అందుకే కులశేఖరుడు ‘అద్యైవ-ఇదిగో ఇప్పుడే, ఇప్పుడే శీఘ్రంగా, అంటే అంతా సవ్యంగా ఉన్నప్పుడే హే కృష్ణా! నీ పాద పద్మాలనే పంజరంలో నా మానసమనే రాజహంసను ప్రవేశించనివ్వు’ అని కోరుకోవాలన్నాడు. అదీ ఆ మహానుభావుడి దివ్యమైన ఆకాంక్ష. చిట్టచివరి దశలో మనోవాక్కాయాలేవీ మన మాట పట్టించుకోవు కదా! అందుకని ఆ మహాభక్తుడి ఆకాంక్ష మన ఆకాంక్ష కావలసి ఉన్నది.
డాక్టర్ వెలుదండ
సత్యనారాయణ
94411 62863