కర్మ, త్యాగం రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. కర్మ తెగినప్పుడు వ్యక్తి జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. కర్మ ఫలాలను అనుభవిస్తూ త్యాగాలు చేయడం గొప్ప విషయం.
కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః
సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః॥
(భగవద్గీత 18-2)
కర్మలను త్యజించటమే సన్యాసమని మహర్షులు అంటారు. సర్వకర్మల ఫలాలను త్యాగం చేయడమే సన్యాసమని కొందరి అభిప్రాయం. ఈ రెండిటికి తేడా సామాన్య దృష్టికి కనిపించదు. మహర్షులు కర్మలు ఆచరించేటప్పుడు వారిలో ఎలాంటి కోరిక ఉండదు. అయితే, కోరిక లేకుండా ఎవరూ ఏ పనీ చేయరు. ప్రతి కర్మ వెనుక ఒక కోరిక ఉంటుంది. ఉపాసనలు, నోములు, వ్రతాలు, యజ్ఞ యాగాది క్రతువులు, తపస్సులు ఆచరించడం వెనుక రెండు రకాల ఆకాంక్షలు కనిపిస్తూ ఉంటాయి. మొదటిది ఇష్టవస్తు ప్రాప్తి, రెండోది అనిష్ట వస్తు నివారణ.
మానవుడు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు పూర్వ జన్మ వాసనలు తప్ప మరేదీ తీసుకురాలేడు. వర్తమానంలో ఆ మనిషి కష్టసుఖాలకు అవే కారణం అవుతాయి. భగవంతుడు పంచభూతాల ద్వారా జీవితాన్ని సుఖవంతం చేస్తూనే ఉన్నాడు. అందుకే వాటికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అంటే భగవంతుడిని స్తుతించడమే! సాధన పరిపక్వత పొందినప్పుడు విశ్వమంతా ఒకే దైవాన్ని దర్శించగలుగుతాడు. ‘ఏకం సత్’ అంటూ పరబ్రహ్మాన్ని ఆరాధిస్తాడు. విశ్వమంతటా ఉన్న దైవం తనలోనూ ఉన్నాడన్న భావన పొందుతాడు. ‘చరాచర సృష్టి భగవంతుడిదే అయినప్పుడు తాను కూడా ఆయన వాడినే’ అన్న అనుభూతికి లోనవుతాడు. పరమాత్మతో ఏకత్వం అనుభవిస్తూ ఆయనలో లీనమవుతాడు.
సాధకుడు ఇలాంటి ఉన్నత స్థితికి చేరుకోవడం ఆషామాషి వ్యవహారం కాదు. చెప్పినంత తేలిక కాదు. దీక్షగా ఆచరణలోకి దిగితే గానీ, అందులోని లోతుపాతులు, కష్టసుఖాలు తెలియవు. కర్మఫలాలు సాధకుడిని అంత తేలిగ్గా విడిచిపెట్టవు. చేసిన కర్మకు నాశనం ఉండదు. వాటి ఫలితాలను అనుభవించక తప్పదు. మంచి, చెడు పని ఫలితాల కోసం మనం పడే తపన మహాప్రవాహమై ముంచెత్తుతుంది. అనుకూల ఫలితాల కోసం చూపే యావ మన మనసులో ముద్రలు వేసుకుంటూ మరో జన్మకు కారణం అవుతాయి. అయితే, కర్తవ్యం, నిస్వార్థం, పరోపకార దృష్టితో చేసే కర్మలు భగవదర్పణం అవుతాయి. స్వార్థం, కీర్తికాంక్ష, ఐశ్వర్య వాంఛతో చేసే కర్మలు మనసులో ముద్రించుకుపోయి మరో జన్మకు దారితీస్తాయి. ఇలాంటి కామ్య కర్మలను త్యజించటమే సన్యాసం. అలాంటి కర్మల ఫలితాలను త్యజించడమే త్యాగం అవుతుంది. కోరికల వల్ల వ్యక్తి ప్రశాంతత చెదిరిపోతుంది. ప్రశాంతత లోపించిన మనసు పతనమవుతుంది. అహంకారం మనసులో విస్తరించి అంధకారంలోకి నెట్టివేస్తుంది.
అహంకారం ఆవహించిన వ్యక్తి ఉద్ధరణ అంత తేలిక కాదు. అలాంటి వ్యక్తి కర్మఫలంపై ఆశతో కర్తవ్యాలను విధిగా నిర్వర్తించలేడు. ఫలితంగా అతని వర్తమానం చింతాక్రాంతం అవుతుంది. భవిష్యత్తు నాశనం అవుతుంది. అతని కర్మలన్నీ సామర్థ్యహీనాలుగా కనిపిస్తాయి. ఇలాంటి స్వార్థపూరిత కర్మలు అనేక జన్మలను తెచ్చిపెడతాయి. ఈ కర్మల వల్ల మనసు కూడా బుద్ధి నుంచి దూరంగా జరిగిపోతూ మోక్ష మార్గాన్ని మరచిపోతుంది. ఈ విష వలయంలో నుంచి బయటపడలేక నీచ ప్రవృత్తిలోకి జారిపోతుంది. ఇలాంటి హానికారకమైన ఫలాసక్తిని త్యజించడమే నిజమైన త్యాగం. కర్మ ఫలాలపై అపేక్ష లేనప్పుడు సాధన ముందుకు సాగుతుంది. భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. సర్వోన్నత లక్ష్యం సిద్ధిస్తుంది.
కనుమ ఎల్లారెడ్డి
93915 23027