‘అవతారం’ అంటే పై లోకం నుంచి ఏదో ఒక రూపం ధరించి కిందికి దిగిరావడం. క్రమం తప్పుతున్న సృష్టిని సరిదిద్దడం, దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ, ఆదర్శ జీవన విధానాన్ని నేర్పడం అవతార ప్రయోజనాలు. శ్రీ మహావిష్ణువు అవతారాలలో మొదటిది మత్స్యావతారం. దీని ప్రాముఖ్యాన్ని ‘మత్స్యపురాణం’ సంపూర్ణంగా తెలియజేస్తుంది. ఈ పురాణంలో 18వేల శ్లోకాలున్నాయి. అష్టాదశ పురాణాలు విష్ణుమూర్తి 18 అంగాలుగా పేర్కొన్నారు. వాటిలో మత్స్యపురాణం మహావిష్ణువు మెదడుగా చెబుతారు.
‘తస్యసాక్షాత్ ప్రసన్న స్యాత్ శివోవిష్ణుశ్చ సానుగః’ అని ఆర్ష వాక్కు. అంటే పురాణాలను శ్రద్ధగా వింటే శివకేశవులు ప్రసన్నులు అవుతారని చెబుతారు. పురాణాలకు కర్త వ్యాసుడు. వక్త సూతుడు. శౌనకాది మహామునులు శ్రోతలు. సప్తర్షి కల్పంలో శ్రీహరి వైవస్వత మనువు (సత్యవ్రతుడు)కు మత్స్యపురాణం ఉపదేశించాడు. వైవస్వతుడు సూర్యుడి కొడుకు. మనువు కాకముందు ఆయన పేరు సత్యవ్రతుడు. ద్రవిడ దేశాన్ని ధర్మంగా పాలించేవాడు. రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి మలయపర్వతంపై చాలాకాలం తపస్సు చేశాడు. సత్యవ్రతుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ప్రళయకాలంలో ప్రాణులందరినీ రక్షించే శక్తిని అనుగ్రహిస్తాడు.
ఒకరోజు కృతమూల నదిలో తర్పణం వదులుతూ ఉంటే సత్యవ్రతుడి దోసిట్లో ఓ చేప పడుతుంది. దానిని మళ్లీ నీటిలో వదులుతాడు. ‘జలచరాలు తింటాయని నాకు భయం’ అంది చేప. ‘రక్షిస్తావని నీ దోసిట్లోకి వస్తే, మళ్లీ నీళ్లలో వదులుతావా!’ అంటుంది. అప్పుడు రాజు చేపను తీసుకొని కమండలంలో వేసి తీసుకెళ్తాడు. చూస్తుండగానే చేప పరిమాణం పెరుగుతుంది. దానిని మరో జలపాత్రలో వేస్తాడు రాజు. క్షణాల్లో చేప పరిమాణం ఆ పాత్ర మేరకు పెరుగుతుంది. బావిలో, చెరువులో, పెద్ద సరోవరంలో వేసి చూశాడు. దాని పరిమాణం పెరుగుతూ పోయింది. చివరకు సముద్రంలో వదిలాడు. కడలినంతా ఆక్రమిస్తూ చేప పెరిగిపోయింది. ఆ మాయ అంతుబట్టక ‘ఎవరు నీవు?’ అని అడుగుతాడు రాజు.
అప్పుడా మీనం ‘నేను విష్ణుమూర్తిని. ఇవాళ్టికి ఏడో రోజున ప్రళయం ముంచుకొస్తుంది. ముల్లోకాలూ నీటిలో మునిగిపోతాయి. చిమ్మచీకటి కమ్ముకుంటుంది. నీ దగ్గరికి ఒక పెద్ద నౌక వస్తుంది. సూక్ష్మ శరీరాలతో సమస్త ప్రాణులు, సమస్త ఔషధులు, సప్త రుషులతో ఆ పడవను ఆశ్రయించు. నేను మత్స్య రూపంలో వస్తాను. ఒక మహా సర్పం కనిపిస్తుంది. దాన్ని తాడుగా చేసి నావను, నా కొమ్ముకు బంధించు. నేను రక్షిస్తాను’ అంటుంది. సత్యవ్రతుడు ఏదో అడగబోతుంటే.. ‘సృష్టి పునఃప్రారంభం లోపు నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెబుతాను. తర్వాతి సృష్టికి నీవే ప్రజాపతివి’ అని మాయమైంది. తర్వాత ఏడు రోజులకు విష్ణుమూర్తి మత్స్యరూపధారిగా వారిని రక్షిస్తాడు. తర్వాత సత్యవ్రతుడికి బ్రహ్మతత్తాన్ని ఉపదేశిస్తాడు. మహావిష్ణువు మీనంగా అవతరించిన చైత్ర శుక్ల పంచమిని మత్స్యజయంతిగా చేసుకోవడం సంప్రదాయం.
దేవుడు చేపలాంటి అల్పప్రాణిగా దిగిరావడం ఏమిటి? అనుకోవద్దు. సృష్టిలోని ప్రాణులన్నీ సమానమే! ఎప్పుడు ఏ రూపం అనుకూలమో, ఏది ధరించాలో భగవానుడి ప్రణాళికకు సంబంధించినది. మరో పౌరాణిక గాథ ఆధారంగా ప్రళయ సమయంలో బ్రహ్మ నిద్రిస్తుంటాడు. ఆయన ముఖం నుంచి వేదాలు బయటకు వస్తాయి. వాటిని సోమకాసురుడు అనే రాక్షసుడు దొంగిలిస్తాడు. శ్రీహరి ఆ అసురుణ్ని సంహరించి, వేదాలను రక్షించి తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు. తమోగుణం కమ్ముకుంటే విజ్ఞానం మరుగున పడుతుంది. బలహీనతలను రెచ్చగొడుతుంది. భగవంతుడి అనుగ్రహంతో స్వస్థితి సాధ్యమవుతుంది. స్థితికారుడి లీల మత్స్యావతారం. జీవ పరిణామ క్రమానికి ప్రారంభం. ఆది అవతారమూర్తి అయిన మత్స్యనారాయణస్వామిని మనసారా ప్రార్థిద్దాం.
(నేడు మత్స్య జయంతి)
-డాక్టర్ వెలుదండ సత్యనారాయణ
94411 62863