అనువ్రతః పితుః పుత్రోమాత్రా భవతుసమ్మనాః
(అథర్వణవేదం 3-30-2)
సంతానం తల్లిదండ్రుల ఆదేశాన్ని తప్పకుండా పాటించాలి. తల్లిదండ్రులతో ప్రేమపూర్వకంగా, శ్రద్ధాభక్తులతో మెలగాలి. ఎందుకంటే కని పెంచే దేవతలే కనిపించే దేవతలు. వాళ్లే తల్లిదండ్రులు.
‘మాతరం పితరం చైవ సాక్షాత్ ప్రత్యక్ష దేవతాం’ (మహానిర్వాణ తంత్రం) తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా భావించి అన్నివిధాలా వారిని సేవించాలి. ఎప్పుడూ వారిని తీయని మాటలతో పలకరించాలి. వారికిష్టమైన వాటిని సమకూర్చాలి. వృద్ధులైన అమ్మానాన్నల కనీస అవసరాలు చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలదే. వాళ్లను కూర్చోబెట్టడంలో, పడుకోబెట్టడంలో సాయం చేయాలి. సకాలంలో భోజనం అందించాలి. మంచినీళ్లు, అవసరమైన ఔషధాలు గుర్తుంచుకొని మరీ అందించాలి. వారి శేషజీవితం ఏ బాదరబందీ లేకుండా విశేషంగా సాగిపోయేలా చూసుకోవాలి. బిడ్డలు మంచిపనులు చేసినప్పుడే తల్లిదండ్రులకు సంతృప్తి. అలాంటి సంతోషాన్ని కలిగించినప్పుడే ‘సంతానం’ అనే మాటకు సార్థకత కలుగుతుంది.
‘మాతా పితరముత్థాయ పూర్వమేవాభివాదయేత్ ఆచార్యంచ’ అని ఆర్షవాక్కు. ఉదయం లేవగానే అందరికన్నా ముందుగా తల్లికి, తండ్రికి, ఆచార్యునికి ప్రత్యక్షంగా నమస్కరించాలి. సమీపంలో లేకపోతే మనసులోనైనా వారిని తలచుకొని నమస్కృతులు తెలియజేయాలి. ఇది జన్మనిచ్చినవారికి, ఆత్మ సంస్కారాన్ని నేర్పినవారికి కృతజ్ఞతాంజలి. తల్లి ప్రేమ విశ్వజనీనమైనది. జన్మ ప్రదాతలు, జీవన మార్గనిర్ణేతలు జననీ జనకులు అని మన ప్రాచీన వాఙ్మయం అడుగడుగునా తెలుపుతుంది. సకల జీవరాసుల్లోనూ స్వభావ సిద్ధమైన మాతృ ప్రేమను ఇలా అక్షరీకరించారు ‘కవి సామ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ..
వడ్ల గింజలు తన ముక్కు పంటనదిమి
మొదలు తన కూన ఎర్రని వదనమునకు
తవిలి యందించుచున్నది తల్లి పక్షి
‘తల్లి నీ విశ్వరూపమే ఎల్లయెడల’
తాము తిన్నా.. తినకున్నా, తమకున్నా.. లేకున్నా సంతానాన్ని ఆనందపరచడమే తల్లిదండ్రుల సహజ లక్షణం. ఇది సృష్టిలోని సమస్త జీవులకు వర్తించే నైజం.
మహాభారతంలో యక్షుడు ధర్మరాజును ‘ఈ భూమి కంటే బరువైనదేది?’ అని ప్రశ్నించగా ‘అమ్మ భూమికంటే గొప్పద’ని బదులిస్తాడు. అలాగే ‘ఆకాశం కంటే పొడవైనదేది?’ అని ప్రశ్నిస్తే ‘తండ్రి’ అని బదులిస్తాడు. అమ్మది భూదేవి అంత సహనమైతే, నాన్నది ఆకాశమంత అవధులు లేని వాత్సల్యం.
‘న గాయత్య్రాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్’ అన్నది సుప్రసిద్ధ వచనం. అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన జపం లేదు, తల్లిని మించిన దైవం లేదు. మరి ఆ గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించిన గురువుగాను, జన్మకారకుడు తండ్రిని, నవమాసాలు మోసి కన్న తల్లిని ప్రత్యక్ష దైవాలుగా సంభాషించడం తనయుల నైతిక కర్తవ్యం. కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరులను వాగర్థాలతో పోల్చి వర్ణించాడు. వాక్కు, అర్థాలలాగా భార్యాభర్తల దాంపత్య జీవితం కొనసాగితే వారి సంతానం కూడా లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది.
తనయులు కూడా తమ జీవన సాఫల్యానికి సత్సంతానాన్ని కనాలి. తద్వారా పితౄణాన్ని తీర్చుకోవాలి. వంశాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! ‘ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః’ అంటుంది వేదం. అంటే వంశ పరంపరను తుంచకూడదు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానం కనడం ఇవి మానవుడు తప్పనిసరిగా చేయవలసిన విధులుగా వేదం చెప్తున్నది. తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు పట్టించుకోకుండా, వాళ్లు పోయిన తర్వాత ఎన్ని తద్దినాలు పెట్టినా, వారిపేరిట ఎన్ని దానధర్మాలు చేసినా ఫలితం శూన్యమే అవుతుంది.
మరుమాముల
దత్తాత్రేయశర్మ
94410 39146