శ్రీరాముణ్ణి వనవాసం కోసం సుమంత్రుడు రథంలో తీసుకొని వెళుతుండగా, దశరథ మహారాజు వెనుకనుంచి ‘సుమంత్రా! ఆగు. ఇది నా ఆజ్ఞ’ అంటాడు. దానికి శ్రీరాముడు ‘వినపడలేదు’ అని చెప్పమంటాడు. ఇది ధర్మమేనా?
బ్రహ్మాభట్ల ఆత్రేయ- మైత్రేయ శర్మ, సిద్దిపేట
వాల్మీకి రామాయణం ప్రకారం సుమంత్రుడు సారథిగా రాముడు అడవికి బయలుదేరగా, ఆ రథం వెంట పౌరులు, అంతఃపుర జనులతోసహా దశరథుడు, కౌసల్యాదులు పాదచారులై పరుగులు తీస్తూ, సోలిపోతూ..‘ఓ సారథీ రథాన్ని ఆపు. లేదా నెమ్మదిగా పోనిమ్ము’ అని హాహాకారాలు చేస్తుంటారు. దశరథుడు, కౌసల్యాదేవి ‘హా! రామా, హా! సీతా, హా! లక్ష్మణా!’ అని విలపించడం చూసి ద్రవించి పోయాడు శ్రీరాముడు. ఏనాడూ కాలు కింద పెట్టని తన తల్లిదండ్రులు, దుఃఖిస్తూ నేలపై నడిచి రావడం సూటిగా చూడలేని శ్రీరాముడు, ‘రథాన్ని త్వరగా పోనిమ్మని‘ సారథిని తొందరించాడు. అప్పుడే దశరథుడు ‘ఆగు మాగుము’ అని గట్టిగా అరుస్తుండటం, శ్రీరాముడు ‘పోనిమ్ము పోనిమ్ము..’ అని తొందరించడం చూసిన సుమంత్రుని మనస్సు ముందు వెనుక చక్రాలమధ్య చిక్కుపడిన పురుషుని వలె సంకటస్థితికి లోనయిందంటాడు వాల్మీకి.
సుమంత్రుని పరిస్థితిని గ్రహించిన శ్రీరాముడు, ‘నీవు తిరిగి రాజువద్దకు వెళ్ళిన సమయంలో ‘నా మాటను ఎందుకు వినలేదని’ ఆయన అడిగితే, ‘నేను వినలేదు’ అని చెప్పమంటాడు. ‘ఇంతటి దుఃఖస్థితిలో వున్నవారిని ఓదార్చడానికి ఇది సమయం కాదు’ అని కారణమూ చెప్తాడు
శ్రీరాముడు. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. ‘నేను వినలేదు’
అనడంలో ‘నీ మాటను వినలేదని కాదు, నీ ఆజ్ఞను పాటించలేదనీ’ అర్థం. సుమంత్రుడు ఆ వేళ శ్రీరాముని సారథిగా ఆయన ఆజ్ఞను పాటించాడే కాని రాజాజ్ఞను పాటించలేదు. ఒకవేళ దశరథుడు దండించినా దానికి సన్నద్ధమయ్యే సుమంత్రుడు రథాన్ని త్వరగా పోనిచ్చాడు. దశరథుని వెంట వచ్చిన మంత్రులుకూడా రాజుని ఓదార్చుతూ, ‘మహారాజా! ఆత్మీయులు తిరిగి మనలను చేరుకోవాలని కోరుకుంటారు. కాబట్టి, ఎక్కువ దూరం అనుసరింపరాదు’ అనడం, దశరథుడు వెనుదిరగడం జరిగింది. ఇక్కడ ధర్మాధర్మ చర్చకన్నా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా శ్రీరాముడు స్పందించాడు. ‘తానెలాగూ వెళ్ళాలి. తల్లిదండ్రులను, ఆత్మీయులను ఎక్కువసేపు బాధ పెట్టేకన్నా త్వరగా అక్కడినుండి వెళ్ళిపోవడం మంచిది’ అనే భావనతోనే శ్రీరాముడు అలా ప్రవర్తించినట్లుగా అర్థం చేసుకోవాలి.
పాలకుర్తి
రామమూర్తి