అంజనీ గర్భ సంభూతం కపీంద్ర సచివోత్తమమ్
రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా॥
మానవ మనస్సుకు ప్రతీక హనుమంతుడు. మనసు ఎలా ప్రవర్తించాలో తెలియజేసినవాడు హనుమంతుడు. అగ్నితత్త్వానికి ప్రతీక అయినవాడు. ఆకాశతత్త్వం వైపు విస్తరించే మార్గోపదేశకుడు. వాయుపుత్రుడైన ఆంజనేయుని గాథలన్నిటిలోనూ మనసుకు సంబంధించిన అంశాలే ప్రాధాన్యం వహిస్తాయి. మన సాహిత్యమంతా ప్రతీకాత్మకమే. మూల తత్త్వాన్వేషణ చేసిన ఋషులు అందించిన వారసత్వంలో వేర్వేరు తత్త్వాలకు వేర్వేరు దైవాలను ప్రతీకలుగా నిర్ణయించి ఉపాసించి, పూజించారు. వారందరిలోనూ విభిన్నమైన, ప్రత్యేకమైన, ఆరాధనీయమైన, అనుసరణీయమైన దైవం హనుమంతుడే. ‘శరీరం, మనసు, ఆత్మ’ అనే త్రిపురాలు అందరికీ సమానమే. శరీరం కదలాలంటే మనసు ఆజ్ఞాపించాలి. మనసు, శరీరం మనుగడ సాగించాలంటే ఆత్మ ఉండాలి. ఆత్మలేని శరీర, మనస్సులకు అస్తిత్వమే లేదు. శ్రీరాముడు ఆత్మతత్త్వానికి ప్రతీక. ఆయన ఆత్మారాముడు. హనుమంతుడు మనస్తత్వానికి ప్రతీక. రాముని ముందర హనుమంతుడు సేవకుడిలాగా ఉంటూ చెప్పిన పని మాత్రమే చేయాలి. సొంత నిర్ణయాలకు తావుండదనడానికి హనుమంతుని గాథయే ప్రతీక.
మనం చూసే విగ్రహరూప హనుమంతుడు కూడా రాముని ముందర మోకరిల్లి, తలెత్తకుండా రామనామ పారాయణం నిరంతరం చేస్తున్న రూపంలో కనిపిస్తుంటాడు. సొంత తెలివికన్నా మరొకరు చెప్పినప్పుడే తన శక్తి ఏమిటో ఆయనకు తెలుస్తుంది. తన శక్తికన్నా మూలశక్తి అయిన రామనామ స్మరణవల్లే తనకు శక్తి వస్తుందని నమ్మినవాడు తను. అటువంటి హనుమని నిత్యం స్మరించడం వల్ల మనకు బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, భయరాహిత్యం, రోగరాహిత్యం, జడరహితం, వాక్ ప్రకటనాశక్తి వంటివి సిద్ధిస్తాయి. ఇవన్నీ మనసు ఆత్మనుండి తెచ్చుకునే గుణసంపదలు మాత్రమే. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి భూమి పుట్టాయని వైదిక సంప్రదాయం తెలియజేస్తున్నది. అందుకే, వాయుపుత్రుడైన హనుమంతుడు అగ్నితత్త్వానికి ప్రతీకగా కార్యనిర్వహణా సమర్థుడవుతున్నాడు. మంత్రశాస్త్రం ప్రకారం ‘హం’ అనే బీజాక్షరం ఆకాశతత్త్వానికి సంబంధించింది. ఆకాశం, విశాలత్వానికి, శూన్యానికి సంకేతం. మనసు శక్తిని పెంచుకొంటూ విస్తరించాలని సూచించే బీజాక్షరం ‘హం’. ఈ అక్షరం చేరేటట్లుగా ఋషులు శ్రీరామదూతకు ‘హనుమంతుడు’ అని నామకరణం చేశారు. ఈ శబ్దోచ్చారణవల్ల కూడా మనిషి విస్తరిస్తూ, ఆత్మచైతన్యానికి చేరువవుతుంటాడు.
అందుకే, హనుమంతుని మనం నిత్యమూ ఉపాసించాలి. ఫలితంగా మానసిక శక్తి పెరగడమేకాక విస్తరిస్తుంది. జ్ఞానమూ పెరుగుతుంది. భయాలు తొలగి అభయం సిద్ధిస్తుంది. సకల సంపదలు వెల్లివిరుస్తాయి. అందరూ ‘ఓం హం హనుమతే నమః’ అనే మంత్రాన్ని కనీసం రోజుకు 1,108 సార్లు పారాయణం చేసినా తగిన శక్తియుక్తులు లభిస్తాయి.
సాగి ,కమలాకరశర్మ