నామ సంకీర్తనం యస్య, సర్వపాప ప్రణాశనం భగవంతుడి నామ సంకీర్తనం సర్వపాపాలను కడిగివేస్తుంది అంటుంది భాగవతం. దీనిని నిజం చేస్తూ భగవంతుడి నామ సంకీర్తన పరమార్థాన్ని వేలాది కీర్తనల రూపంలో వర్ణించి, తెలుగువారికి అందించిన ధన్యజీవి తాళ్లపాక అన్నమాచార్యులు. హరికీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు, పంచమాగమ సార్వభౌముడుగా ప్రసిద్ధి చెందిన అన్నమయ్య 15వ శతాబ్దంలో తన కీర్తనలతో వైష్ణవ మతాన్ని పునరుజ్జీవింప జేశాడు. అన్నమయ్య క్రీ.శ. 1408 మే 9వ తేదీ వైశాఖ పూర్ణిమనాడు రాజంపేట సమీపంలోని తాళ్లపాకలో జన్మించాడు. తల్లిదండ్రులు లక్కమాంబ, నారాయణ సూరి స్థానిక చెన్నకేశవుడి పరమభక్తులు. విష్ణుమూర్తి ఖడ్గం నందకాంశతో జన్మించిన అన్నమయ్యకు ఆ పేరు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ వాచకంగా పెట్టారు.
నారాయణ సూరిది పెద్ద కుటుంబం. తన 16వ ఏట గడ్డి కోసేందుకు వెళ్లిన అన్నమయ్యకు వేలు తెగడంతో ఒకవిధమైన వైరాగ్యం కలుగుతుంది. తాను ఉన్నచోటుకు దగ్గర్నుంచే కొంతమంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. అన్నమయ్య పాదాలు వారిని అనుసరించాయి. తిరుమల చేరుకునే క్రమంలో మోకాళ్ల మెట్టు దగ్గరికి వచ్చే సరికి అలసిసొలసి మూర్ఛిల్లాడు. ఇంతలో ఒక మహాతల్లి ఆయనకు సపర్యలు చేసి, స్వామి ప్రసాదం ఇచ్చి సేదదీర్చింది. ఆమెలోనే అందరి అమ్మ అలమేలుమంగను వీక్షించిన అన్నమయ్య ‘వేంకటేశ్వర’ మకుటంతో శతకాన్ని వెలయించాడు. తిరుమల చేరుకున్న అన్నమయ్య ‘శ్రీహరి పాదతీర్థంబే చెడని మందు/ మోహపాశాలు కోసి మోక్షమిచ్చే మందు’ అయిన వేంకటేశుడి సేవకే జీవితాన్ని అంకితం చేశాడు. అక్కడే ఘనవిష్ణుయతి అప్పటివరకు స్మార్తుడిగా ఉన్న అన్నమయ్యకు విశిష్టాద్వైత విశిష్టతను బోధించాడు. వైష్ణవంలోకి ఆహ్వానించాడు. ఈ సమయంలోనే రోజుకు ఒక్క సంకీర్తనయినా రాయమని వేంకటేశ్వరుడు అన్నమయ్యను కలలో ఆదేశించాడట. కొన్నాళ్లకు తమ బిడ్డను వెతుక్కుంటూ నారాయణ సూరి దంపతులు తిరుమల చేరుకున్నారు. స్వామి అనుజ్ఞతో తల్లిదండ్రులతో సొంతూరికి వెళ్లిన అన్నమయ్య తిరుమలమ్మ, అక్కలమ్మను వివాహం చేసుకున్నాడు.
గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ అన్నమయ్య మనసంతా ఆ వేంకటేశ్వరుడే. తర్వాత కాలంలో అన్నమయ్య ప్రసిద్ధ నరసింహ క్షేత్రం అహోబిలం చేరుకున్నాడు. అహోబిల మఠం వ్యవస్థాపకుడు ఆదివణ్ శఠకోప యతీంద్రుల దగ్గర వేదాంత రహస్యాలు తెలుసుకున్నాడు. ఆయన నుంచే నృసింహ మంత్ర దీక్ష పొందాడు. తిరుమల, అహోబిలం అన్నమయ్య జీవితంలో విడదీయరాని భాగాలు. ఈ రెండే కాకుండా ఒంటిమిట్ట, సోమశిల, సంబటూరు, నల్లబల్లి, కదిరి, కలశాపురం, శ్రీరంగం, చిదంబరం, కంచి, హంపీ విజయనగరం తదితర వైష్ణవ క్షేత్రాలు తిరిగినట్లు కీర్తనల నుంచి తెలుస్తున్నది. ఏ క్షేత్రంలోని దైవమైనా అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వరుడే. అందుకే ప్రతి కీర్తననూ ‘వేంకట’ ముద్రతోనే రచించాడు.
అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుడిని వినుతిస్తూ పరమ మంత్రములైన 32,000 సంకీర్తనలు రాసినట్లు ఆయన మనుమడు చిన తిరువేంగళనాథుడి ‘అన్నమాచార్య చరిత్రము’ ద్విపద కావ్యం నుంచి తెలుస్తున్నది. ప్రస్తుతం దొరుకుతున్నవి 14,000 మాత్రమే. సంకీర్తనలు, వేంకటేశ్వర శతకం కాకుండా అన్నమయ్య ద్విపద రామాయణం, శృంగార మంజరి, సంస్కృతంలో వేంకటాద్రి మాహాత్మ్యం, 11 శతకాలు, ప్రబంధాలు రాశాడని అంటారు. ఇవి అలభ్యాలు. అన్నమయ్య తన అధ్యాత్మ, శృంగార సంకీర్తనల ద్వారా పల్లవి, చరణాలతో కూడిన కీర్తనకు తెలుగు సాహిత్యంలో స్థిరత్వం కల్పించాడు. తొలి తెలుగు వాగ్గేయకారుడిగా నిలిచిపోయాడు. 1503లో (దుందుభి నామ సంవత్సరం) ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు వైకుంఠ ప్రాప్తి పొందిన అన్నమయ్య తెలుగు సాహిత్యానికి అమరకోశం.
– హర్షవర్ధన్