ఏదైనా విషయాన్ని అనేకసార్లు విన్నా, చదివినా వాటి ప్రభావం మనసు మీద తెలియకుండా పనిచేస్తుంది. మన దైనందిన వ్యవహారాల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మన జీవన సరళి కూడా మారుతుంది. అందుకే, మనిషి మనసును సన్మార్గంలో పెట్టేందుకు పురాణాలు చదవాలని, కనీసం వినాలని పెద్దలు చెబుతారు.ఇందుకు కార్తిక పురాణం ఉత్తమ ఉదాహరణ.
కార్తిక పురాణం విన్నంత మాత్రాన అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయని నిరూపించే పురాణగాథ ఇది. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయన కొడుకు తండ్రి మాట వినకుండా, చెడు సావాసాలు పట్టి, ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. ఓ సంవత్సరం కార్తిక మాసంలో కుమారుడికి కార్తికం పవిత్రతను చెప్పి వ్రతం ఆచరించమన్నాడు దేవశర్మ. కానీ, తండ్రి మాటను కొడుకు తిరస్కరిస్తాడు. నాస్తిక ధోరణిలో తండ్రిని ఎదిరిస్తాడు. కోపోద్రిక్తుడైన ఆ తండ్రి.. కుమారుణ్ని ఎలుకగా పుట్టమని శపిస్తాడు. అప్పటికి తన తప్పు తెలుసుకున్న కొడుకు ‘క్షమించమ’ని తండ్రి కాళ్ల మీద పడతాడు. ‘ఎప్పుడు కార్తిక మాహాత్మ్యాన్ని (కార్తిక పురాణాన్ని) వింటావో అప్పుడు నీకు పాపవిమోచనం అవుతుంది’ అని చెబుతాడు తండ్రి.
ఎలుకగా మారిన దేవశర్మ కుమారుడు సమీప అరణ్యంలో ఓ చెట్టుతొర్రలో నివసించసాగాడు. కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి అటుగా వచ్చాడు. కావేరీ నదిలో స్నానం చేసి, ఎలుక ఉన్న చెట్టు దగ్గరే విశ్రమిస్తాడు. అదేసమయంలో ఒక బోయవాడు వారిని దోచుకోవాలని భావిస్తాడు. కానీ, సజ్జనదర్శనంతో అతనిలోని పాపపు ఆలోచనలన్నీ తొలగిపోతాయి. సాత్వికుడిగా మారిపోతాడు. విశ్వామిత్రుడి కాళ్లపై పడి ‘మీ దర్శనంతో నాలో తెలియని మార్పు వచ్చింది. నాకు ముక్తి కలిగేలా ఏదైనా ఉపదేశించమ’ని మహర్షిని కోరుతాడు బోయవాడు.
విశ్వామిత్రుడు వెంటనే కార్తిక వ్రత మాహాత్మ్యాన్ని గురించి చెబుతూ.. కార్తిక పురాణాన్ని వినిపిస్తాడు. జరుగుతున్నదంతా చెట్టు తొర్రలో నుంచి చూస్తున్న ఎలుకకు శాప విముక్తి కలిగి అసలు రూపం వస్తుంది. అప్పుడు ఆ దేవశర్మ కుమారుడు విశ్వామిత్రుడి కాళ్లమీద పడి విషయమంతా చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది ఇంటికి వెళ్లిపోతాడు. బోయవాడు కూడా ఆనాటి నుంచి హింసా ప్రవృత్తి విడిచిపెట్టి అంత్యకాలంలో ముక్తిని పొందుతాడు. తల్లిదండ్రులను ఎదిరించిన వాడు కష్టాల పాలవుతాడని, సజ్జన దర్శనం, సజ్జన సాంగత్యం మనిషిలో మంచి మార్పు తీసుకువస్తుందనే సందేశం కూడా ఈ కథలో అంతర్లీనంగా ఉంది.
స్కాంద పురాణంలో అంతర్గతంగా ఉన్న కార్తిక పురాణం మనిషి ఎలాంటి తప్పులు చేసే అవకాశం ఉందో చెబుతూనే, వాటినుంచి ఎలా బయటికి రావాలో సూచిస్తుంది. ధర్మమార్గంలో నడవాలంటే ఎలాంటి ఆచార, సంప్రదాయాలు పాటించాలో వివరిస్తుంది. అన్నిటికన్నా మిన్నగా దానగుణం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు పెంచుతుంది. వీటన్నిటి కోసం మనిషి చెయ్యాల్సిన కర్తవ్యాన్ని సూచిస్తుంది. ఎన్నో ధర్మనియమాలు బోధించే కార్తిక పురాణం చదవడం, అందులో చెప్పిన నియమాలు పాటించడం మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి
అత్యుత్తమమైన ధర్మమార్గం.
…? డా॥ కప్పగంతు రామకృష్ణ