పూర్వం ఖట్వాంగుడనే చక్రవర్తి సప్తద్వీపాలతో కూడిన భూమండలాన్నంతా పాలించేవాడు. రాక్షసుల చేతిలో ఓడిపోయిన దేవేంద్రాది దేవతలు ఖట్వాంగుడి సాయం కోరారు. ఆయన దేవలోకానికి వెళ్లి దానవులను ఎదిరించి, దేవతలకు విజయం కట్టబెట్టాడు. అప్పుడు దేవతలు ఖట్వాంగుడిని ఏదైనా వరం కోరుకోమన్నారు. ‘నేను ఎంత కాలం జీవిస్తానో చెప్పండి?’ అన్నాడు ఖట్వాంగుడు. ‘నీ ఆయుర్దాయం ఇంకో ముహూర్త కాలం (రెండు ఘడియలు=48 నిమిషాలు) మాత్రమే మిగిలి ఉంది’ అన్నారు దేవతలు. ఆ మరుక్షణంలో ఖట్వాంగుడు భూమి మీదికి దిగివచ్చాడు. తన సంపదనంతా పండితులకు, బీదసాదలకు దానం చేశాడు. రాణులను, మిత్రులను, బంధుగణాన్ని మానసికంగా వదిలిపెట్టాడు. గోవిందనామం స్మరిస్తూ భయాన్ని విడిచిపెట్టాడు. రెండు ఘడియల్లో ముక్తిని పొందాడు.
ఖట్వాంగుడి కథ భాగవతం ద్వితీయ స్కంధంలో ఉంది. ఇది చదివినప్పుడు కొన్ని సందేహాలు తలెత్తుతాయి. రాక్షసులను జయించడం దేవతలకే సాధ్యం కానప్పుడు మానవుడు ఎలా సాధించగలిగాడు? మనిషి సాయం కోరిన దేవతలు అతనికి తిరిగి వరం ఇవ్వడం ఏమిటి? దేవతలు, రాక్షసులు మన శరీరాల్లోనే సూక్ష్మరూపాల్లో ఉంటారు. దేహంలోని మనసు, ఇంద్రియాలు, బుద్ధి దేవతలు. ఒకవైపు వారు ఉండగానే… కామం, క్రోధం మొదలైన అరిషడ్వర్గాలు, అహంకారం, మమకారం తదితర రూపాల్లో రాక్షసులు పుట్టుకొస్తారు.
జీవుడు కష్టపడి మంచి అలవాట్లు చేసుకొని మనసును ప్రజ్ఞవైపు మరలించకపోతే మనలోని రాక్షసులు విజృంభించి దేవతలను ఓడిస్తారు. అప్పుడు దేవతలు జీవుణ్ని సాయం కోరుతారు. జీవుడే వారికి సాయం చేయాల్సి ఉంటుంది. ఇందులో సారాంశం ఏమిటంటే.. మనిషి ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే అతనిలోని దేవతలకు బలం చేకూరుతుంది. అప్పుడు ఆ దేవతలే మనలోని రాక్షసులను ఓడించగలుగుతారు. క్రమంగా జీవుడి ఉద్ధరణ జరుగుతుంది. తద్వారా జీవుడు ఊర్ధలోకాలు చేరడానికి అర్హుడు అవుతాడు. లేకపోతే అధఃపాతాళానికి జారిపోయి, జనన-మరణ చట్రంలో చిక్కుకొని కొట్టుమిట్టాడాల్సి వస్తుంది.
డా॥ వెలుదండ
సత్యనారాయణ
94411 62863