ప్రళయకాలం పూర్తయింది. పాలనను ప్రారంభించి సంతతిని వృద్ధి చెయ్యమని స్వాయంభువ మనువు, శతరూపలకు చెప్పాడు బ్రహ్మదేవుడు. తీరా చూస్తే అక్కడ భూమి లేదు. జల ప్రళయంలో మునిగిపోయి పాతాళానికి చేరుకుంది. ‘ఏం చేసేది?’ అన్నట్టుగా చూశాడు మనువు. బ్రహ్మ దీర్ఘాలోచనతో గట్టిగా నిశ్వసించాడు. శ్వాసతోపాటు వరాహం రూపం కలిగిన శిశువొకటి బయటకు వచ్చింది. చూస్తూ చూస్తూండగానే ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా ఆ వరాహం బ్రహ్మాండమైన ఆకారంతో ఎదిగింది. భీతిగొల్పే ఆ వరాహాన్ని శ్రీమన్నారాయణునిగా గుర్తించి తన కష్టాన్ని చెప్పుకొన్నాడు బ్రహ్మ. జలరాశిలోకి ప్రవేశించి భూమిని తన కోరల మీద నిలిపి పైకితెచ్చాడు వరాహమూర్తి. చుట్టూ అష్టదిగ్గజాలను ఏర్పర్చి వాటి తొండాలపై భూమిని నిలిపి ఉంచాడు. అప్పటినుంచి భూమి తన గతి తప్పకుండా ఆ దిగ్గజాలు కాపాడుతున్నాయి.
స్వాయంభువ మనువు పాలన మొదలైంది. ఆ సమయంలోనే బ్రహ్మకు ఆ రోజుకు సంబంధించిన పగటికాలం మొదలైంది. బ్రహ్మలోకం కాలమానం ప్రకారం ‘కల్పం’ అంటే ఒక రోజు. శ్వేత వరాహం లోకాలను ఉద్ధరించిన కారణంగా ఈ రోజుకు ‘శ్వేత వరాహ కల్పం’ అన్న పేరు స్థిరపడింది. ఈ కల్పంలోనే మనం జీవిస్తున్నాం. ‘వర’ అంటే శ్రేష్ఠమైన, ‘అహము’ అంటే పగలు అని అర్థాలు. వరాహం అంటే శ్రేష్ఠమైన పగలు అని భావం. పగటిపూట వెలుగు ఉంటుంది. ఆ వెలుగు తెల్లగా ఉంటుంది కాబట్టి శ్వేత వరాహం. దీన్నే యజ్ఞ వరాహం అని కూడా పిలుస్తారు. మన కరీంనగర్లో ‘యజ్ఞ వరాహ క్షేత్రం’ ఉన్నది. మైసూరు మహారాజా భవనంలో శ్వేత వరాహ క్షేత్రమున్నది. చైత్ర బహుళ త్రయోదశి నాడు మనం ‘యజ్ఞ వరాహ జయంతి’ని జరుపుకొంటాం.
ఊర్వశి, పురూరవులకు సింహాచలం కొండపైన వరాహ రూపంలో ఉన్న నరసింహస్వామి దర్శనమిచ్చాడు. వారు నాడు పూజించిన వరాహ నృసింహస్వామి మూర్తినే నేడు మనం సింహాచలంలో కొలుస్తున్నాం. హిరణ్యాక్ష వధ అనంతరం వరాహ రూపంతో భూమిని ఉద్ధరించి సుస్థిరంగా నిలిపి ఉంచిన వరాహస్వామినే మనం ఆది వరాహమూర్తిగా పూజిస్తున్నాం. భాద్రపద శుద్ధ తృతీయను వరాహ జయంతిగా ఆచరిస్తున్నాం. హిరణ్యాక్ష వధ ఆరోదైన చాక్షుష మన్వంతర కాలంలో జరిగిందని ఐతిహ్యం.
సనక సనందనాదుల శాపం కారణంగా జయ, విజయులు కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో హిరణ్యకశ్యప, హిరణ్యాక్షులుగా జన్మించారు. తపస్సంప న్నులై బ్రహ్మ నుంచి వరాలు పొందారు. వర గర్వితులై లోక కంటకులుగా మారారు. హిరణ్యం అంటే బంగారం. అక్షం అంటే కన్ను. బంగారం పైన కన్ను కలిగినవాడు అంటే ప్రపంచ సంపదలన్నీ స్వాధీనపరుచుకొని బలవంతంగా అనుభవించాలన్న కోరికగలవాడని అర్థం. భూమిని చాపగా చుట్టి సముద్రం అడుగున పాతాళంలో దాచిపెట్టాడు హిరణ్యాక్షుడు.
సకల ప్రాణికోటికి నిలయమైన భూమి కుంగిపోవడంతో దేవతలంతా మహా విష్ణువుతో మొర పెట్టుకుంటారు. అప్పుడు మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి భూమిని తన ముట్టెపై ఉంచి పైకి తీసుకువస్తాడు. విష్ణుమూర్తి ప్రయత్నానికి హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు. సముద్ర జలాలపై భూమిని పదిలంగా నిలిపిన వరాహమూర్తి భీకర యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఆ అసురుణ్ని సంహరించిన కారణంగా కలిగిన అలసటను తీర్చుకునేందుకు స్వామివారు విశ్రమించిన స్థలం ఆదివరాహ క్షేత్రమైంది. తర్వాతికాలంలో ఆ క్షేత్రం వేంకటేశ్వరస్వామి నివాస స్థానమైంది. తిరుమలలో ప్రధాన దైవం శ్రీవేంకటేశ్వరుడే అయినా క్షేత్రపాలకుడిగా వరాహమూర్తి నిలచి ఉన్నందున ఆది వరాహస్వామిని దర్శించుకోకుండా చేసుకునే శ్రీవేంకటేశ్వర దర్శనం నిష్ఫలం అవుతుంది. నిత్యపూజలు అందుకునే ఆది వరాహమూర్తి ఆలయం మహాబలిపురంలో కూడా ఉన్నది.
వరిగొండ కాంతారావు
94418 86824