మండన మిశ్రుడు నర్మదా నదీ తీరంలోని ప్రస్తుతం మహేశ్వర్ అని పిలుస్తున్న మాహిష్మతి పట్టణవాసి. ఆయన వేద వేదాంగాలను ఔపోసన పట్టిన కర్మవాది. సంవాదంలో అతనిని ఓడిస్తే కర్మవాదాన్ని జ్ఞానమార్గం అదిమి పెట్టగలదని ‘కుమారిల భట్టు’ తన ఆత్మ సమర్పణకు ముందు ఆది శంకరులతో తెలుపుతాడు. వెంటనే ఉత్సాహంతో మాహిష్మతికి చేరుకుంటాడు శంకరభగవత్పాదులు. మండన మిశ్రునితో సంవాదానికి దిగుతాడు. ఈ సమరానికి మండన మిశ్రుని భార్య ఉభయభారతీదేవి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. పోటీ ప్రకారం సంవాదంలో మండన మిశ్రుడు ఓడిపోతే సన్యాసం స్వీకరించాలి. అదే జరిగింది. కర్మ యోగం కన్నా జ్ఞానమార్గమే మిన్న అని అంగీకరిస్తాడు మండన మిశ్రుడు. సన్యాసం స్వీకరిస్తాడు. ఉభయభారతి అతడిని త్యజించి వెళ్లిపోతుంది. శంకరుల శరణు జొచ్చి తనకు జ్ఞానబోధ చేయమని వేడుకుంటాడు మండన మిశ్రుడు.
ఆదిశంకరులు ప్రసన్న వదనంతో ‘వత్సా! జనన మరణాలు లేవు, సంసారగతీ లేదు, దృశ్యాలతో కూడిన జగత్తు సత్యం కాదు. మూడు కాలాల్లోనూ ఏ సద్వస్తువు ఉంటుందో అదే పరబ్రహ్మం. అది నీవే. అదే ‘తత్త్వమసి’ అంటాడు. ఇది పరమ సత్యం. దాదాపు ఐదారు లక్షల ఏండ్ల క్రితం భూమిపై మానవుడు లేడు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అసలు జీవమే లేదు. భూమి.. తల్లి అయ్యే యోగ్యత సాధించగానే అమీబా నుంచి డైనోసార్ల దాకా జీవం క్రమంగా పుట్టి పెరిగింది. మానవుడనే జీవి పరిణామక్రమంలో అభివృద్ధి చెందుతున్నాడు. కాలం తిరగగానే మన ప్రస్థానం ముగిసిపోతుంది. అందరం పాంచభౌతిక శరీరాలను వదలి, విస్తృత పంచభూతాలలో కలగలసిపోతాం. అలా సుదూర భవిష్యత్తులో భూమిపై మానవుడుండే అవకాశం మృగ్యం. ఆ తర్వాత జీవం కూడా ఉండదు. కాలం తీరాక భూమి కూడా ఆవిరైపోయి విశ్వంలో కలిసిపోతుంది. సూర్యుడూ.. తన కాలానంతరం కనిపించకుండా విశ్వశక్తి అనే ఆత్మలో కలిసిపోతాడు.
వివరంగా చెప్పాలంటే.. తల్లి గర్భం నుంచి బయటపడ్డ బిడ్డ తల్లితో భౌతికంగా విడివడి స్వతంత్రంగా ఉండగలుగుతుంది. ఆ తల్లితో సంబంధం లేకపోయినా జీవించగలుగుతుంది. తన మరణానంతరం తిరిగి తల్లిలో కలిసిపోదు, పోలేదు. కానీ, ఈ భౌతిక ప్రపంచం అలా ఉండలేదు. అది దేని నుంచి రూపుదిద్దుకుందో దానిని విడిచి ఉండలేదు. దాని నుంచి బాహ్యంగా వెళ్లలేదు. చివరికి కాలానంతర దశలో వేరే పదార్థాన్ని చేరుకోలేదు. ఈ దృశ్య వ్యవస్థ అంతా ఆ ఆత్మలోనే జరిగిపోతుంది. ఒక చలన చిత్రం తెరమీద కనపడ్డట్టుగా కనపడి చెదిరిపోతుంది. అందుకే ఆది శంకరులు ‘జనన, మరణాలు మిథ్య’ అని, ‘కనిపించేదంతా మాయ’ అని అన్నాడు. ఉపనిషత్తుల సారమూ అదే.
ఆ సద్వస్తువు గురించి రుషులు పరిశోధనలు చేశారు. తమ మేధోనేత్రాలతో కనుగొని దానిని ఆత్మ ‘అతతి సర్వత్ర వ్యాప్నోతి ఇతి ఆత్మః’ అన్నారు. శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన దివ్యచక్షువులు ఆ మేధోనేత్రాలే. ఆ ‘అక్షర’ పదార్థమే సత్యమని, దానికే బ్రహ్మ పదార్థమని, ఆత్మ అని రకరకాల పేర్లతో, పలు విధాలుగా ఉపనిషత్తుల్లో వర్ణిస్తూ వచ్చారు. నేటి పాశ్చాత్య శాస్త్రవేత్తలు డార్క్ ఎనర్జీ, డార్క్ మేటర్ అంటూ పరిశోధనలు సలుపుతూ ఆ పదార్థాల లక్షణాలు వర్ణించలేక, తమ మెదళ్లకు విపరీతంగా పని కల్పిస్తున్నారు. కానీ, మన రుషులు వేల ఏండ్ల క్రితమే ‘యత్తదద్రేశ్యమ్ అగ్రాహ్యమ్ అగోత్రమ్..’ అంటూ ఆత్మ లక్షణాలను కూడా కండ్లకు కట్టారు. ఆ మేధోనేత్రాలతో మనమూ ఆ సద్వస్తువును కనుగొందాం.
–రావుల నిరంజనాచారి