‘భావనమే జీవనం, జీవనమే భావనం’ అన్నది సుస్పష్టమైన నిత్యానుభవ సత్యం. మనసులో కలిగే రకరకాల భావనల సారమే అనుభవం. అనుభవాల ప్రతిఫలమే అనుభూతి. పుట్టుక నుంచి గిట్టే వరకూ అన్ని వయోదశల్లో, వివిధ పరిస్థితుల్లో ప్రతి మనిషిలోనూ రకరకాల అనుభవాలు కలుగుతూనే ఉంటాయి. అందులో మనకు ప్రీతి కలిగించేవి కొన్ని ఉంటాయి. బాధ మిగిల్చేవి కూడా ఉంటాయి. మనపై, మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిన అనుభవాలు మాత్రమే మనసులో బలంగా నాటుకుపోతాయి. ఈ ప్రీతి, అప్రీతి జన్మతః వచ్చిన స్వభావం వల్ల కొంత, సాధన బలం వల్ల ఇంకొంత, దేహ బలాబలాల వల్ల మరికొంత వివిధ స్థాయిల్లో ప్రభావం చూపుతూ ఉంటాయి.
ఒక దశకు ఎదిగిన తర్వాత మనలో కలిగే భావాలు రెండు రకాలుగా ఉంటాయి. భౌతిక జీవనం వల్ల కలిగే భావాలు ఒకటైతే. వాటికి కారణాలు వెతకడం వల్ల ఏర్పడే భావాలు రెండో రకం. కారణాలను వెతికే క్రమంలో భౌతిక పరిధులు దాటినప్పుడు కలిగే భావనలతో ఆధ్యాత్మిక అన్వేషణ మొదలవుతుంది. ఈ భావనల ప్రగాఢ ముద్రలు మన అనుభవంగా మిగిలిపోతాయి. అనుభవం కారణంగా తలెత్తే సంవేదనాత్మక పరిస్థితే అనుభూతి. ఒక వస్తువును గుర్తించడం, దానితో తాదాత్మ్యం చెందడం వల్ల అనుభూతి ఏర్పడుతుంది. వస్తువుల వల్ల, పరిస్థితుల వల్ల కలిగే తక్షణ అనుభూతి సహజమైనది, ప్రాకృతికమైనది. దానికి సంస్కారంతో పనిలేదు. ప్రశాంత స్థితిలో ఇసుమంత నిరహంకార చింతన ద్వారా కలిగే అనుభూతి వివేచనాత్మకమైంది, సంతులితమైంది. అలాంటి చింతన సంస్కారవంతమై ఉంటుంది.
భౌతిక విషయ ప్రపంచంతో కలిగే తాదాత్మ్యత వల్ల ఏర్పడే అనుభూతి ముతక అయినది. ఇది తాత్కాలికంగా ఉంటుంది. దానిని మించిన వస్తువో, సందర్భమో ఎదురైనప్పుడు అంతకుముందు కలిగిన అనుభూతి తొలిగిపోతుంది. అంతేకాదు వివిధ పరిస్థితుల్లో కలిగే ఈ అనుభూతి, దాని నుంచి ఏర్పడే స్పందనలు అనాలోచితమైన, ఆవేశపూరితమైన తక్షణ ప్రతిచర్యలకు కారణమవుతాయి. అదే పరిణత అనుభవం నుంచి పుట్టే స్పందనలు సాలోచితమైన, సంతులితమైన ప్రాజ్ఞ చర్యలకు దోహదం చేస్తాయి. అందుకే ప్రతి అనుభవం ఒక పాఠం చెబుతుందని అంటారు పెద్దలు.
మనం గ్రహించే విషయాల ఆధారంగానే అనుభవాలు ఏర్పడుతుంటాయి. చేసే కర్మల ఆధారంగానూ ఏర్పడుతుంటాయి. ఏ అనుభవాలు మనం పదేపదే పొందుతామో వాటివల్ల కలిగే అనుభూతులు బలపడి మన స్వభావాన్ని నిర్మిస్తాయి. అందుకే, మనసుపై దుష్ప్రభావం చూపే పరిస్థితులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మన చుట్టూ సత్ప్రభావక పరిస్థితులు ఉండేలా జాగ్రత్తపడాలి. ఏ అనుభవాలు మనలో కృతజ్ఞత, ప్రేమ, దయ, ధైర్యం, ధర్మనిష్ఠను నింపుతాయో వాటిని ఉదాత్తమైనవిగా, దైవీయమైనవిగా పేర్కొన్నారు పెద్దలు. ఆ అనుభవాలు ఎలా పొందాలన్నది ఇక్కడ ప్రశ్న. నిత్యం దైవారాధన, పొందిన ప్రతి సహాయానికి అటు ప్రకృతికీ, ఇటు సమాజానికీ కృతజ్ఞత ప్రకటించడం, స్వధర్మ నిర్వహణ, దానం, పరోపకారం ఇలాంటి కర్మలు ఆచరించడం ద్వారా ఉన్నత అనుభవాలు పొందవచ్చు.
సద్గురువు మార్గదర్శనం ద్వారా, మంచి గ్రంథం పఠించడం ద్వారా ఉన్నత విలువలు పెంపొందుతాయి. అవి మన అంతఃకరణాన్ని శుద్ధిపరిచి, ఉన్నతికి ప్రేరణ కలిగిస్తాయి. క్రమంగా మనసును అభౌతికమైన, పారమార్థిక అన్వేషణ మార్గంవైపు నడిపిస్తాయి. అదే క్రమంలో పూర్ణమైన, పారమాత్మికమైన, సచ్చిదానంద అస్తిత్వం దిశగా మనసును విస్తరింపజేస్తాయి. ఆ విస్తరణలో కలిగే అనుభూతి దేశకాలాతీతమైనది. అదే సకల భేదాలకు అతీతమైన శివానుభవం. నిరాపేక్షానందమైన శివానుభవాన్ని ప్రోది చేసుకోవడమే మానవ జీవితానికి నిజమైన లక్ష్యం కావాలి. అదే అమృతత్వానికి దారి అవుతుంది. మోక్షానికి ద్వారమవుతుంది.
–యముగంటి ప్రభాకర్
94401 52258