భగవంతుడి దర్శనం ఓ అంతుచిక్కని వ్యవహారం. అది తరతరాల మానవుడి తీరని తృష్ణ. ప్రసంగాల వల్లనో, మేధాశక్తి వల్లనో, ప్రవచనాలు వినడం వల్లనో భగవంతుడి దర్శనం అనే ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదంటుంది ముండకోపనిషత్తు. ఎవరైతే తనదైన ఉపాయాల చేత ప్రయత్నిస్తారో పొందుతారని చెబుతుంది.
‘మహాశయా! మీరు భగవంతుడిని కండ్లారా చూశారా?’ అని పరమహంసను ప్రశ్నించాడు నరేంద్రుడు. దానికి ఆయన ‘అవును చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా, ఇంకా స్పష్టంగా’ అని జవాబిచ్చాడు. మళ్లీ ‘నిన్ను చూస్తున్నట్లుగా, నీతో మాట్లాడుతున్నట్లుగా భగవంతుడిని చూడవచ్చు. భగవత్ దర్శనం పొందలేదని ఎవరు విలపిస్తున్నారు? ఆయనను దర్శించాలనే పరమ వ్యాకులతతో తపిస్తే ఆయన తప్పకుండా సాక్షాత్కరిస్తాడు’ అంటాడు రామకృష్ణ పరమహంస.
యముడిని కలిసిన నచికేతుడు ‘యమధర్మరాజా! మీరు చెబుతున్న సుఖాలన్నీ అశాశ్వతాలు. అవి మనిషి ఇంద్రియాల శక్తిని వృథా చేసేవే. జీవితమే స్వల్పమైనది. కనుక మీరు చెప్పిన గుర్రాలూ, ఆటలూ, పాటలూ అన్నింటినీ మీరే ఉంచుకోండి. నాకు మాత్రం ఏ విషయంలో సందేహం నెలకొని ఉందో, పరలోక విషయంలో ఏది తెలుసుకుంటే గొప్ప ఫలం లభిస్తుందో, ఏ నిజం అత్యంత గోప్యంగా దాగి ఉందో దానిని తెలుసుకోవాలి. మరే వరమూ అవసరం లేదు’ అని సమవర్తిని అడుగుతాడు. అందుకు ఆయన ఆత్మ దర్శనం చేసుకున్నవాడు అరుదని చెబుతూ, గీతాచార్యుడు చెప్పినట్టుగా ‘ఆత్మదర్శనం అయినవారు కూడా ఆశ్చర్యంలో ఉన్నారు. నీవు అడిగిన ఆత్మ ఎంతో శ్రమతో కూడుకున్నది, గోప్యమైనది, అత్యంత చీకటి ప్రాంతం లో దాగి ఉంది. సనాతనమైనది. హృద్గుహలో ప్రకాశించేది. బుద్ధి వికాసం పొందినవాడు, ఆ ఆత్మను అధ్యాత్మ యోగం ద్వారా కనుగొని జ్ఞానియై సుఖదుఃఖాలకు అతీతుడవుతాడు’ అంటాడు యముడు.
మరో సందర్భంలో శౌనకుడు అంగిరసుని సమీపించి, చేతులు జోడించి, ‘దైవ సమానుడా! దేనిని తెలుసుకుంటే ఈ సమస్తమూ బోధపడుతుంది’ అని అడుగుతాడు. అందుకు అంగిరసుడు ఇచ్చిన జవాబే ‘ముండకోపనిషత్తు’. ‘ఆత్మ అనేది నిరంజనమైన, నిర్గుణమైన సనాతన వస్తువని, అనంతమైనదని, దానికి ఇంద్రియాలకు చిక్కే లక్షణాలేవీ లేవని, అయినా అన్ని రూపాలుగా మారేదీ, అలా మారి వాటిల్లో దాక్కొని ఉండేదీ అదే’ అని ఆత్మను విశదీకరించింది ముండకోపనిషత్తు. ఎలాగైతే సాలీడు నుంచి దారాలు ఉద్భవిస్తాయో, ఎలాగైతే భూమి నుంచి చెట్టూచేమా పెరుగుతున్నాయో, ఎలాగైతే జీవి శరీరంపై వెంట్రుకలు పెరుగుతున్నాయో అలాగే ఆ ఆత్మ నుంచి ఈ సృష్టి వెలుగులోకి వస్తుందని ఆ ఉపనిషత్తు స్పష్టం చేసింది.
భగవంతుడు అంటే కేవలం ఏదో మానవ రూపంలోనో, జంతువు రూపంలోనో, వృక్ష రూపంలోనో, కాంతి రూపంలోనో ఉండే వస్తువు కాదు. భగవాన్ అనే పదం నుంచి భగవంతుడు ఉద్భవించింది. భగవాన్ అంటే జ్ఞానం, ఐశ్వర్యం, బలం, వీర్యం, తేజస్సు, శక్తి అనే ఆరు గుణాల సమాకలన రూపం. ఈ ఆరు గుణాలను షాడ్గుణ్యమని, భగమనీ అంటారు. ఇవి సంపూర్ణంగా ఉన్న చైతన్యమే భగవంతుడు. ఈ గుణాలన్నీ అపారమైనవి. అవి ఎందులో దాక్కుని ఉన్నా, ఏ రూపాన్ని ధరించినా అది భగవంతుడే. ఈ ఆరు గుణాల కారణంగానే ఈ విశ్వం మనుగడలోకి వస్తుంది.
ఈ ఆరు చైతన్యాలే ఈ విశ్వంలోని సూక్ష్మం నుంచి అనంతం వరకు ఉన్న అన్ని రూపాల్లో విస్తరించి ఉంటాయి. అది తెలుసుకోవడమే ‘ప్రజ్ఞానం బ్రహ్మ’. భగవంతుని రూపం సూక్ష్మాతి సూక్ష్మం నుంచి ఈ భూనభోంతరాలూ నిండి, ఆపై మానవుడి మేధకు అందనిదై వెలుగొందుతున్నది. ‘ఈశావాస్య మిదగ్ం సర్వం’ అన్నట్లుగా భగవంతుడు వ్యాప్తి చెందని రూపం ఈ విశ్వమే కాదు, ఏ విశ్వంలోనూ లేదు. ఇది అర్థం చేసుకున్నవాడు, తన మనసులో జీర్ణించుకున్నవాడికి అన్నిటా, అంతటా ఆ భగవంతుడే దర్శనమిస్తాడు. ఇందుగలడందు లేడను సందేహం అవసరం లేదు. రామకృష్ణులు చెప్పినట్టు భగవత్ దర్శనం కోసం తపించిన వారు తప్పకుండా తరిస్తారు.
రావుల నిరంజనాచారి