పృథు మహారాజు భూలోక చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనప్పుడు ప్రధాన దేవతామూర్తులలో ఒకరైన వరుణదేవుడు రాజుకు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని అందజేశాడు. అదే ‘సూక్ష్మనీటి రేణువులను చిలకరించే ఒక ఛత్రం’ (గొడుగు)! అటువంటి గొడుగే ఒకటి వేసవికాలంలోని మండుటెండల్లో మీ దగ్గరకూడా వుంటే ఎలా వుంటుందో ఆలోచించండి. కేవలం నీడను మాత్రమేగాక చల్లటి సూక్ష్మనీటి రేణువులనూ చిలకరిస్తూ అది మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా అందిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ ప్రజలంతా కరోనా తాపానికి లోనవుతున్నారు. దీనినేకాదు, ఈ భౌతిక ప్రపంచంలోని క్లేశాలన్నిటినీ తొలగించుకొనే అత్యంత సులభమైన మార్గం ఒకటుంది. అదే ‘హరే కృష్ణ’ మహా మంత్రోపాసన.
మానవులను ప్రధానంగా మూడు రకాల క్లేశాలు (దుఃఖాలు) చుట్టుముడుతుం టాయి. అవి: అధ్యాత్మికమైనవి (తనువు, మనస్సుల వల్ల కలిగేవి), అధిభౌతిక మైనవి (ఇతర జీవులవల్ల కలిగేవి), అధిదైవికమైనవి (దైవ ప్రోద్బలంతో సంభ వించే ప్రకృతి విపత్తులు వంటివి). వీటినే ‘తాప-త్రయాలు’గా పేర్కొంటారు. శ్రీకృష్ణుని విశుద్ధ భక్తుడైన ఉద్ధవుడు ఈ తాపత్రయాల నుండి ఉపశమనాన్ని కలిగించే అద్భుతమైన ‘రక్షణ ఛత్రాన్ని’ మానవాళికి అందించారు.
తాపత్రయేణాభి హతస్య ఘోరే
సన్తప్య మానస్య భవాధ్వనీశ
పశ్యామి నాన్యచ్ఛరణం తవాఙ్ఘ్రి
ద్వన్ద్వాతపత్రా దమృతాభివర్షాత్.
-భాగవతం (11.9.19)
‘జనన, మరణాలతో కూడిన ఈ సంసారమనే భయానకమైన దారిలో తాపత్రయాలతో పరితపించే వారికి మీ పాదపద్మాలు అనే గొడుగు కంటే వేరే రక్షణ ఏదీ నేను చూడటం లేదు. ఈ గొడుగు ఎండనుంచి తప్పించడమేకాక అమృతాన్నికూడా వర్షిస్తుంది’. ఇలా ఉద్ధవుడు ‘వరుణ ఛత్రం’ కన్నా ఉత్తమమైన, అమృతవర్ష ధారలను కురిపించే ప్రత్యేక ఛత్రాన్ని గురించి వివరించారు. అదే ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ‘పాదపద్మాల రక్షణ ఛత్రం’.
తాప-త్రయాలతో నిత్యం సతమతమవుతున్న వారంతా ఆ భవతాపం నుండి ఉపశమనాన్ని పొందేందుకు వెంటనే ఆ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయించా ల్సిందిగా ఉద్ధవుడు సూచిస్తున్నాడు. మానవుడు జనన-మరణ చక్రం నుండి విడుదల కావాలంటే కేవలం ‘సైద్ధాంతిక జ్ఞానం’ చాలదు. ‘తాను భౌతిక శరీరం కాదు, జీవాత్మ’ అనే జ్ఞానం ఒక్కటే ముక్తికోసం సరిపోదు. ప్రతి ఒక్కరూ తమ స్వరూప స్వభావాన్ని అనుసరించి నడచుకోవాలి. ఇందుకు ‘భక్తియుత సేవ’నే శరణ్యం. ఈ జన్మ కర్మ, పునర్జన్మల నుండి విముక్తిని సాధించేందుకు ఆచరణ యోగ్యమైన ఆ విధానంలో భగవంతుని పాదపద్మాలను అందరం ఆశ్రయిద్దాం.
శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు. దేవదేవుని ప్రతినిధి అయిన ఒక ప్రామాణిక ఆచార్యుడిని ముందుగా మనం ఆశ్రయించా లి. వారి సూచనల మేరకు భక్తి సాధన చేయడం ద్వారా ఈ ప్రపంచంలోని తాపత్రయాల నుండి ఉపశమనం లభిస్తుంది. ‘బ్రహ్మ-మధ్వ-గౌడీయ’ సంప్రదాయంలో 32వ ఆచార్యులైన పూజ్యశ్రీ ఏ.సి. భక్తి వేదాంతస్వామి శ్రీల ప్రభుపాదులవారు శ్రీకృష్ణుని శరణు పొందే సులభమైన మార్గాన్ని మనకు అందించారు. అదే భగవంతుని పవిత్ర, దివ్యనామాలను జపించడం.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
శ్రీల ప్రభుపాదుల వారిని మనసులోనే ఆశ్రయించి ఈ మహామంత్రాన్ని జపిస్తూ భగవన్నామాలను ఆరాధించేవారు తమ హృదయ తాపత్రయాల నుండి శీఘ్రంగా ఉపశమనాన్ని పొంది, ఆనందానుభూతి చెందగలరనడంలో ఎలాంటి సందేహం లేదు. హరే కృష్ణ.
-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984