హైదరాబాద్ : చిలుకూరు బాలాజీ ఆలయంలో దర్శనాలకు సంబంధించిన సమయాలపై ఆలయ అర్చకుడు రంగరాజన్ వివరణ ఇచ్చారు. కొవిడ్ నేపథ్యంలో ఉదయం 6గంటల నుంచి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు దర్శన సమయాల్లో చేసిన మార్పులను గమనించాలని విజ్ఞప్తి చేశారు.
గూగుల్లో చూపే సమయాలను అనుసరించొద్దని కోరారు. కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రస్తుత సమయాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా భక్తులకు సమాచారం అందించినా గందరగోళం నెలకొందని, గూగుల్ను కూడా అలర్ట్ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు మనుపటి టైమింగ్స్ను చూపుతోందన్నారు. వీలైనంత త్వరగా టైమింగ్స్ను అప్డేట్ చేయాలని రంగరాజన్ గూగుల్ను అభ్యర్థించారు.