బాలాజీ జిల్లా : తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా పెద్దజీయర్ స్వామి మఠంలో కలశ స్థాపన, కలశ పూజ, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత సేకరించిన పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు. అనంతరం పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుంచి శ్రీ చిన్నజీయంగారు, ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.
శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా వారికి ఘన స్వాగతం పలికారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పెద్దజీయంగార్కి మేల్చాట్ వస్త్రాన్ని, చిన్నజీయంగార్కి నూలుచాట్ వస్త్రాన్ని బహూకరించారు. ఆ తర్వాత పెద్దజీయర్ మఠంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి కలిసి ఈఓను శాలువతో సత్కరించారు.

ఈ సందర్భంగా పెద్దజీయర్స్వామి మాట్లాడుతూ.. వైష్ణవ సంప్రదాయకర్త రామానుజాచార్యుల పారంపర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైందన్నారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుంచి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నదని వివరించారు. అనంతరం చిన్నజీయర్స్వామి మాట్లాడుతూ.. రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా గురు పూర్ణిమ పర్వదినాన ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైందిగా భావిస్తారన్నారు.