శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు ముక్కంటీశుడు త్రిశూలధారియై భ్రామరితో కలిసి భృంగివాహనంపై విహరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో శ్రీగిరులు శివన్నామస్మరణతో మార్మోగాయి. అంతకు ముందు ఆలయంలో చండీశ్వరపూజ, మండపారాధన, కలశాచర్చన, శివపంచాక్షరీ జపానుష్టాలు, రుద్ర పారాయణాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన భృంగి వాహనంపై వేంచేపు చేసి షోడశోపచార పూజలు చేశారు. ఆ తర్వాత మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య క్షేత్రం ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలువీరభధ్ర స్వామి వరకు గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవంలో చెంచుకళాకారుల జానపదాలు, కోలాటాలు, వేషధారణలు, జాంబ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం.. వివిధ విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామిఅమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది. గ్రామోత్సవంలో కార్యనిర్వాహణాధికారి లవన్నతోపాటు, అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్, ఈఈ మురళీబాలకృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, ఫణీంద్రప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూలు నిర్వహించనున్నారు. సాయంత్రం హంస వాహన సేవ నిర్వహించనున్నట్లు ఈవో కేఎస్ లవన్న తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి స్వామి అమ్మవార్ల తరఫున పట్టవస్త్రాలు సమర్పించనున్నట్లు ఈవో లవన్న పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచే పాతాళగంగలో స్నానాలు చేసుకొని ఆ తర్వాత.. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఈవ లవన్న తెలిపారు. ఆర్జిత సేవలు రద్దు చేసి అందరికీ అలంకార దర్శనాలు కల్పిస్తున్నట్లు వివరించారు. క్యూలైన్లలో భక్తులకు అల్పాహారం, నీరు, మజ్జిగ అందజేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి అన్నదాన ప్రసాదం అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
కాలినడకన వస్తున్న భక్తులకు మార్గమధ్యలో అన్నదానం, మంచినీరు అందించే సంస్థలకు వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. అటవీ ప్రాంతం నుంచి నడకదారిన వచ్చే భక్తులకు సైతం ఆసుపత్రిలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా క్షేత్ర పరిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు సంప్రదాయనృత్యాలు, పార్వతీ కల్యాణం హరికథ, భక్తరంజనీ సంగీత కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు భ్రామరీ కళావేదికతోపాటు శివదీక్షా శిబిరం వద్ద కొనసాగాయి. ఇదిలా ఉండగా.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించాలని కర్నూల్ జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు సూచించారు. బుధవారం ఉత్సవాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈవో లవన్న, డీపీవో నాగరాజునాయుడు, ఆత్మకూరు డీఎస్పీ శృతి, తహసీల్దార్ రాజేందర్ సింగ్, మండల వైద్యాధికారి సోమశేఖర్తో సమీక్ష నిర్వహించారు.