తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavams ) భాగంగా ఆరో రోజు సోమవారం సాయంత్రం శ్రీవారు బంగారు తేరులో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో స్వర్ణరథోత్సవం ( Golden chariot ) అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు.
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసమని అర్చకులు వెల్లడించారు. స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, సీఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.