భగవద్గీతలో ఉన్నది ఏమిటి? చెబుతున్నది ఏమిటి? ఆధ్యాత్మికవాదులు చెబుతున్నట్టు భగవద్గీత సనాతన మార్గ సంస్కృతీ సంప్రదాయాలను ఉటంకిస్తూ, ఆధ్యాత్మిక పరిపూర్ణతను అందించే మకుటాయమానమైన మహాగ్రంథమా? అభ్యుదయవాదులు భావిస్తున్నట్టు.. ఓ కల్పితగాథలోని ఊహాతీత భాగమా? మూఢ విశ్వాసాలను ప్రేరేపించే గ్రంథమా? అంధ విశ్వాసాలను అంతమొందించే శస్త్రమా? ఇలాంటి అనేక సందేహాలు తలెత్తుతాయి. ఈ విషయాలపై అనేక వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.
భగవద్గీత జీవన విలువల బంగరు పూత. హిందూ సంస్కృతీ సంపత్తుల ఊట. భక్తినీ, ముక్తినీ అందించే సాధనా మార్గం. భవరోగ పీడితుల పాలిట మహా ఔషధం. అహం, మోహం, మమకారాలను దునుమాడే దివ్య సాధనం. వ్యక్తిత్వ వికాసాన్ని అందించే మహా విధానం భగవద్గీత. విస్తృత పరిధిలో మనందరిలో అణువణువునా వివేకాన్ని ఆవిష్కరింపజేసే వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత.
భగవద్గీతలో మత ఛాందసం కనపడదు. మత సంబంధమైన మకిలితనం కనిపించదు. మత బంధనం, అజ్ఞానం, ఛాంద సత్వం ఏ కోణంలోనూ ఇందులో కానరావు. సంస్కృతీ, సంప్రదాయం, సనాతనత్వపు జ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం ప్రతి పదంలోనూ ద్యోతకమవుతాయి.
భగవద్గీత అంటే ఏమిటో పేర్కొనడం ఒక్క మాటలో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. భగవద్గీత జీవితానికి శాంతిని, ప్రశాంతతను అందించే ఊరట. పరమాత్మ చూపే త్రోవ. జీవుడు భావించుకుంటునట్లుగా పరమాత్మునికి చేసుకునే సేవ. వ్యావహారిక మార్గానికి అర్థాన్ని, పరమార్థాన్ని, పారమార్థిక తత్త్వాన్ని అందించే వరిష్ట గ్రంథం భగవద్గీత. అమరత్వాన్ని, అమృతత్వాన్ని ఆవిష్కరింపజేసే బంధం భగవద్గీత. ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పరిపుష్టం చేసే దిక్సూచి భగవద్గీత. బంధాలను, భవ బంధనాలను తగ్గించే మహోధృత తరంగాల వాడి భగవద్గీత. మానవాళి మొత్తానికి జీవనాడి ఈ గ్రంథం. జీవన పథాన్ని, విధానాన్ని నిర్దేశించే మహావ్రాత భగవద్గీత. మన తలరాతను మార్చే మహామంత్రం. దివ్యత్వాల మానవత్వాల మధ్య మధ్యవర్తిత్వ దూత భగవద్గీత.
అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని, సర్వులకు ప్రతినిధిగా భావించి, సకల మానవాళికి.. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినిపించిన కర్తవ్య బోధ. గురువులను, బంధువులను, స్నేహి తులను, సన్నిహితులను చూసి మమకారంతో జావగారి నీరుగారిపోయిన అర్జునుడిని కార్యోన్ముఖుణ్ని చేసిన మహా ఉపదేశం ఇది. జీవితమనే యుద్ధంలో జయాలు, అపజయాలు, కష్టాలు, కన్నీళ్లు, మోదం, ఖేదం తప్పవనీ.. అన్నిటినీ ఓర్పుతో, నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే అనే జీవితపాఠాన్ని నేర్పే కార్యనిర్వాహక గ్రంథం ఇది. వ్యక్తికి స్థిత ప్రజ్ఞతను, స్థిర విజ్ఞతను నేర్పుతుంది. ఘన భవితకు పట్టం కట్టే సాధనా సంపత్తులకు ఊతం ఇది. అసుర స్వభావాదులకు వాత పెట్టే నిప్పుకణిక ఈ గ్రంథం.
గాలీ, నీరూ, నిప్పూ, చెట్టూ, గుట్టా, పుట్టా, రాయీ, కొమ్మా , రెమ్మా అన్నీ… ఆ పరంధాముని మయమే అని చెప్పే వేదాంత సంగ్రహం గీత. దేవదేవుడు సూత్రధారియై, జీవుడే పాత్రధారుడై, జగత్తు అనే రంగస్థలం మీద సమస్యలకు సందేహాలకు, సమాధానాలు తెలిపే దివ్య భవ్య మార్గనిర్దేశక రసస్ఫోరక గ్రంథం భగవద్గీత. ‘అన్నీ నేనే’, ‘నువ్వు నిమిత్తమాత్రుడివి’ అనే ఆధ్యాత్మిక రహస్యాన్ని సోదాహరణంగా వివరించింది. అదే సమయంలో సోమరితనం, కర్మ నిర్వహణలో అనాసక్తతను ప్రోత్సహించకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, చేయాల్సిన పని చేసి తీరాల్సిందే అనే పరమ సత్యాన్ని నొక్కి చెప్పిన కర్తవ్య ధార ఇది. సంపూర్ణ సమగ్ర జీవన తత్త్వాన్ని, తాత్త్వికతను అందించే , పరిపూర్ణ ఆధ్యాత్మిక అనుభవాల, ఆధునికతల కలబోత. జ్ఞానాగ్నుల జిలుగు భగవద్గీత.
-రమాప్రసాద్ ఆదిభట్ల
93480 06669