TTD news | ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై 14వ విడత బాలకాండ అఖండ పారాయణం భక్తిసాగరంలో ముంచెత్తింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల సమక్షంలో కార్యక్రమం ఆద్యంతం రామనామస్మరణతో సాగింది.
ఇందులో 66 నుంచి 70 సర్గల వరకు గల 134 శ్లోకాలను పారాయణం చేశారు. యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేపట్టారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి, ధర్మగిరి వేద పాఠశాల పండితులు కే రామానుజాచార్యులు, పీవీఎన్ఎన్ మారుతి.. శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గురజాడ మధుసూదనరావు బృందం కార్యక్రమం ప్రారంభంలో ‘రాముడు నడిచిన వేళ హనుమంతుడు వెతకాల..’ చివర్లో ‘శ్రీ హనుమ జయ హనుమ’ భజన కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.