Ayodhya Ram Mandir | బాలరాముడి ప్రతిష్ఠకు అయోధ్య ముస్తాబైంది. భవ్య మందిరంలో స్థిరనివాసం ఏర్పర్చుకోవడానికి ముచ్చటైన మూర్తి సిద్ధంగా ఉంది. కౌసల్య నందనుడి నునుపు దేలిన చెక్కిళ్లు చూసి యావత్ భారతం మురిసిపోతున్నది. కృష్ణశిలతో రూపుదిద్దుకున్న నీలమేఘశ్యాముడి మోవిపై అందంగా అమరిన చిద్విలాసాన్ని చూసి జగమంతా తన్మయత్వం చెందుతున్నది. శతాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యకు ఆగమించిన చారడేసి కన్నులవాణ్ని ప్రపంచమంతా కండ్లప్పగించి చూస్తున్నది. ఆబాలగోపాలం ఆ బాలరాముడిని పదేపదే తలుచుకుంటూ తరిస్తున్న శుభ ఘడియలు ఇవి. ఈ సందర్భంగా కావ్యాల్లో బాలరాముడి లీలావినోదాన్ని ఒకసారి తలచుకుందాం…
భోజనం చేసే సమయంలో దశరథుడు కుమారుడి మీద ప్రేమతో ‘రామా! రారా!’ అని ప్రేమగా పిలిచేవాడు. బిడ్డతో ముద్దులాడాలని ప్రయత్నించేవాడు. కానీ, బాలరాముడు ఆటల్లో పడి తండ్రి దగ్గరికి వచ్చేవాడు కాదు. ఎలాగైనా బిడ్డను తీసుకువచ్చి తండ్రి ఒడిలో కూర్చోబెట్టాలని తల్లి కౌసల్య ప్రయత్నించినా బాలరాముడు పట్టుబడేవాడు కాదు. చివరికి కౌసల్య ‘రామా! రామా!’ అని ప్రాధేయపడితే అప్పుడు చెంతకు చేరేవాడట. భగవంతుడు ఎంత ప్రయత్నించినా ఎవరికీ పట్టుబడడు. తాను అనుకుంటేనే పట్టుబడతాడు. అందుకే రాముడు నారాయణుడి అంశ.
ఒకరోజున కౌసల్యాదేవి బాలరాముడికి స్నానం చేయించి, అలంకారం చేసి, ఉయ్యాలలో వేసి పడుకోబెట్టింది. తానూ స్నానం చేసి, దేవతామందిరానికి వెళ్లి పూజ చేసుకుంటున్నది. వంటిల్లు నుంచి నివేదన పదార్థాలు ఒక్కొక్కటిగా తెచ్చి దేవతామందిరంలో పెడుతున్నది. ఒక పాత్ర పెట్టి మరొక పాత్ర వంటింటి నుంచి తెచ్చేసరికి బాలరాముడు ఆ నివేదన తింటున్నట్లు కనిపించింది. రాముడు ఉయ్యాలలో ఉండాలి కదా అనుకుంటూ కౌసల్య గబగబా పరుగెత్తి ఉయ్యాల దగ్గరికి వెళ్తే, అందులో బాలరాముడు గాఢనిద్రలో ఉన్నాడు. మళ్లీ దేవతామందిరానికి వెళ్లే సరికి అక్కడ నివేదన ఆరగిస్తూ కనిపించాడు. ‘కలయో! వైష్ణవ మాయో!’ అనుకుంటూ భయంతో కూడిన భ్రమలో మునిగింది కౌసల్య. ఇంతలో రాముడు నవ్వుతూ తల్లిని సమీపించి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో సకల విశ్వం కౌసల్యకు కనిపించింది. వెంటనే రాముడి పాదాల మీద పడి నమస్కారం చేసింది. తిరిగి రాముడు బాలుడిగా మారి, అమ్మకు ఆనందం కలిగించాడు. తన విశ్వరూపం చూసిన విస్మయం నుంచి కౌసల్యను తప్పించి, పూర్వస్థితికి తీసుకువచ్చాడు. ఈ ఘటన బాలరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని నిరూపిస్తుంది.
రామాయణంలో శ్రీరాముడు తాను అవతార పురుషుడినని ఎక్కడా చెప్పుకోలేదు. అలా ప్రవర్తించనూ లేదు. ‘ఆత్మానం మానుషం మన్యే.., అహం దశరథాత్మజః’- ‘నేను మీ వంటి మనిషినే. దశరథుని కుమారుడను’ అని చెప్పుకొన్నాడు. కానీ, రామచంద్రుడిని చూసిన వారందరికీ ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి రూపంలో కనిపిస్తున్నాడని ‘శ్రీరామ కథామృతం’ కావ్యంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి ఇలా
వర్ణించారు..
క్షీరాబ్ధిశయనుడీ చిన్నికూన యటంచుఁ
బాలబుగ్గల హొయల్బయలుపరిచె
ఫణితల్పమహితుఁడీ పసిపాపఁడంచని
మెత్తని నెమ్మేను మేలుసూపెఁ
గమలాక్షుఁడీ కసుగందు నిక్కంబని
కలికి కన్నుల సోయగంబు దెలిపె
శ్రీనివాసుండె యీ చిరుతబిడ్డడని
క్రొత్తకాంతి మరింత యొత్తిపలికె
సకల సంశయములఁ దీర్పజాల దొక్కొ
విశ్వమోహను సర్వాంగ విలసనంబు
చెలఁగు పురుషోత్తముని భాగ్యచిహ్న మెట్లు
దాచుకొన్నను దాగునే తరలనయన
(బాలకాండ)
‘బాలరాముడి పాలబుగ్గలు చూస్తే పాలకడలి మీద పవళించే నారాయణుడు గుర్తుకువస్తున్నాడు. అతని మెత్తని శరీరం ఆదిశేషుడి మీద పవళించే స్వామి ఇతనే అని చెబుతున్నది. బాలరాముడి అందమైన నేత్రాలు మహావిష్ణువు కమలాల వంటి కండ్లను సరిపోలుతున్నాయి. శరీరంలోని అన్ని అవయవాల విలాసం నిస్సందేహంగా ఇతనే విశ్వమోహనుడైన నారాయణుడు అని ప్రకటిస్తున్నది. సాముద్రిక శాస్త్రం ప్రకారం కనిపించే భాగ్యచిహ్నాలు ఇతడే పురుషోత్తముడని స్పష్టం చేస్తున్నాయి’ అని వర్ణించారు కవి.
బిడ్డ పుట్టిన 11 రోజుల వరకు అశౌచం పాటించడం మన ఆచారం. కానీ, దశరథుడు తన బిడ్డను ఎత్తుకోకుండా ఉండలేకపోయాడు. పురుటిలోని బిడ్డను ఎత్తుకోగానే బిడ్డ బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. తల్లి కౌసల్య తీసుకోగానే ఏడుపు మానేవాడు. ఇలా బాలరాముడు తన తండ్రిని పురుటిలోనే ఆటపట్టించాడు. ఇంకోసారి నామకరణ సమయంలో కులగురువైన వశిష్ఠుడు దశరథుడి చేత బియ్యంలో రామచంద్రుడు అని పేరు రాయించాడు. ముహూర్తం సమయానికి ఆలస్యంగా వచ్చిన సుమంత్రుడు బియ్యంలో అక్షరాలు సరిగ్గా కనిపించక రామభద్రుడు అని చదివాడట. ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ విశ్వనాథ సత్యనారాయణ ‘ధాన్యలక్ష్మి తన రైకలేని రొమ్ము మీద రామ నామాన్ని హత్తుకొన్నది’ అని చమత్కరించారు.
– డా॥ కప్పగంతు రామకృష్ణ