ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండుగ బక్రీద్. ఈ సందర్భంగా ఖుర్బానీ ఇస్తారు. ఖుర్బానీ అంటే త్యాగం. ప్రవక్త ఇబ్రాహీం (అలై) చేసిన మహత్తర త్యాగాన్ని స్మరించుకుంటారు. ఐదువేల సంవత్సరాల క్రితం ఇప్పటి ఇరాక్ దేశం ఉండే ప్రాంతాన్ని నమ్రూద్ అనే రాజు పాలించేవాడు. తానే దేవుడినని అహంకరించేవాడు. రాజు బారినుంచి ప్రజలను కాపాడేందుకు ఇబ్రాహీం (అలై) గళం విప్పారు. సృష్టికర్త అయిన ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఆగ్రహించిన రాజు భగభగ మండే అగ్నిగుండంలో ఇబ్రాహీం(అ)ని తోసివేయించాడు.
అయితే, అగ్నిగుండం కాస్తా పూలపాన్పుగా మారింది. మండిపడిన రాజు దేశ బహిష్కార శిక్ష విధించాడు. స్వదేశాన్ని వీడి దూర దేశాలకు వెళ్లిపోయారు ఇబ్రాహీం (అ). తన తదనంతరం దైవ సందేశ కార్యభారాన్ని నిర్వర్తించడానికి తనకు సంతానం ఉంటే బాగుంటుందన్న కోరిక కలిగింది ఆయనకు. దైవం పండంటి బిడ్డను ప్రసాదించాడు. బిడ్డను చూసుకొని ఆ దంపతులు ఎంతగానో మురిసిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దేవుడు ఆయనకు మరో పరీక్ష పెట్టాడు. భార్యను, కొడుకును జనసంచారం లేని ఎడారి ప్రాంతంలో వదిలేసిరమ్మని ఆదేశించాడు.
తన భార్య హాజిరాతో చెప్పగా, ఆమె అందుకు అంగీకరించింది. వారిద్దరినీ ఎడారిలో వదిలేశారు ఇబ్రాహీం (అ). పరీక్షా కాలం ముగిశాక దైవ ఆదేశంతో తిరిగి భార్యాబిడ్డలను కలుసుకున్నారు. కొంతకాలానికి మరో పరీక్ష ఎదురైంది. ఈసారి దైవం ఏకంగా కన్నకొడుకునే త్యాగం చెయ్యమని కలలో ఆదేశించాడు. దైవాదేశాన్ని శిరసావహిస్తూ కొడుకు ఇస్మాయిల్ను పడుకోబెట్టి, కండ్లకు గంతలు కట్టి కుత్తుకపై కత్తి పెట్టారు. మరుక్షణం ఇస్మాయిల్ స్థానంలో పొట్టేలు ప్రత్యక్షమైంది.
అల్లాహ్ అనుగ్రహం ఆ తండ్రీకొడుకులను కాపాడింది. ఆ నాడు ఆ ఇద్దరూ చేసిన త్యాగాన్ని స్మరిస్తూ నేడు ముస్లింలు ఖుర్బానీ ఇస్తుంటారు. హజ్రత్ ఇబ్రాహీం (అ) అపూర్వ త్యాగానికి సంబంధించిన సంఘటనను స్మరిస్తూ, అందుకు చిహ్నంగా పశువును ఖుర్బానీ ఇస్తారు. అందువల్ల దీనికి ఈ ప్రాముఖ్యం ఉంది. అవసరమైతే ధనప్రాణత్యాగాలకు వెనుదీయమన్న సంకల్పాన్ని బక్రీద్ ప్రకటిస్తుంది.
ముహమ్మద్ ముజాహిద్, 96406 22076