తిరుపతి: నెల్లూరులో వచ్చే నెల 16 నుంచి జరుపతలపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. ఉత్సవాలు జరిగే 5 రోజులపాటు సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో గురువారం వైభవోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు.
తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు వైభవోత్సవాల నిర్వహణకు ఆకట్టుకునేలా పైకప్పుతో కూడిన వేదిక, భక్తులు కూర్చునేందుకు గ్యాలరీలు, క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, లడ్డూ విక్రయ కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పోటు, సైన్బోర్డులు తదితర ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, ప్రత్యేక లైటింగ్, ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని చెప్పారు.
భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని సీవీఎస్వోను కోరారు. టీటీడీలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని కోరారు. ఈ సమీక్షలో జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖకుమార్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆయర్వేద ఫార్మసీలో పరిశీలన
అంతకుముందు నరసింగాపురంలోని టీటీడీ ఆయర్వేద ఫార్మసీని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి పరిశీలించారు. ఫార్మసీ ప్రాంగణంలో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న షెడ్ల పనులను పరిశీలించారు. రూ.4 కోట్లతో జరుగుతున్న నూతన యంత్రాల ఏర్పాటుకు సంబంధించిన వచ్చిన యంత్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్టోబరు నాటికి పనులు పూర్తి చేసి నూతన ఉత్పత్తుల తయారీకి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు . జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీ కృష్ణ, సాంకేతిక అధికారి డాక్టర్ నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.