శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో రుద్రమూర్తికి ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. రుద్రవనంలో గత ఏడాది శంకర జయంతి రోజున ప్రతిష్టించిన 14 అడుగుల ఎత్తయిన రుద్రమూర్తికి శాస్ర్తోక్త పూజాధికాలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. రుద్ర దేవుని చల్లని చూపు కృష్ణానదిపై ఎప్పుడూ పడుతూ ఉండాలని నదికి అభిముఖంగా ప్రతిష్టించిన స్వామివారికి గురువారం ఉదయం అర్చక వేదపండితులు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద్ధజలాలతో అభిషేకించి మహా బిల్వార్చన, పుష్పార్చనలు నిర్వహించారు.
అదేవిధంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించి రుద్ర దేవుని శాంతి మంత్రాలు వల్లించారు. శంకర జయంతి సందర్భంగా శుక్రవారం పరివార దేవాలయమైన పాలధార – పంచధార ఆలయంలో ఆది శంకరాచార్యుల జయంతి ప్రత్యేక పూజలు జరిపించనున్నట్లు ఈవో తెలిపారు. ఆది శంకరాచార్యులు తపస్సు చేసి శివానందలహరి మహా గ్రంధాన్ని రచించిన పుణ్య స్ధలమైన పాలధార పంచధార వద్ద ఉదయం శారదాదేవికి, శంకరాచార్యులకు షోడషోపచారాలు క్రతువులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.