తిరుమల : తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా పిలుస్తుంటారు. ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధురఫలాలను స్వామివారికి నివేదిస్తారు.
ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. అలాగే పలురకాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. వేడుకల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్పస్వామి వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు. ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ ఉత్సవాన్ని నిర్వహించలేదు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వేడుకలో పాల్గొన్నారు.
టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వసంతమండపాన్ని శేషాచలం అడవిని తలపించేలా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు, పుష్పాలతోపాటు పలురకాల జంతువుల ఆకృతులను ఏర్పాటు చేశారు. వీటిలో పులి, చిరుత, కోతులు, పునుగుపిల్లి, కొండచిలువ, కోబ్రా, నెమలి, హంసలు, బాతులు, హమ్మింగ్ బర్డ్, మైనా, చిలుకలు ఉన్నాయి. ఇవిభక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
వసంతోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు శ్రీభూ సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. శనివారం రోజున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో పాటుగా సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.