రోజుకో వ్రతంతో కొనసాగే శ్రావణ మాసం నోముతోనే ముగుస్తుంది. శ్రావణ అమావాస్య నాడు పొలాల అమావాస్య (పోలాల అమావాస్య) జరుపుకొంటారు. ఈ సందర్భంగా సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమాల కోసం, కుటుంబ సౌఖ్యం కోరుతూ మహిళలు పొలాల వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తున్నది.
వ్రతం చేసుకోవడానికి ముందు పూజాస్థలిలో ఆవుపేడతో శుభ్రంగా అలికి, వరిపిండితో ముగ్గువేయాలి. రెండు కంద పిలకలను పూజలో ఉంచాలి. పెద్ద కంద మొక్కను తల్లిగా, చిన్నదాన్ని పిల్లగా భావించి పూజిస్తారు. ఈ పిలకలను అమ్మవారిగా తలచి వాటికి తోరాలు కడతారు. ముందుగా వినాయకుడి పూజ చేస్తారు. తర్వాత సంతాన లక్ష్మిని గానీ, మంగళగౌరీదేవిని గానీ కంద పిలకల్లోకి ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజ నిర్వహిస్తారు. తర్వాత వ్రతకథ చదివి అక్షతలు శిరస్సుపై చల్లుకుంటారు. వ్రతం పూర్తయిన తర్వాత సంతానవతి అయిన ముత్తయిదువను పూజించి అమ్మవారికి నివేదించిన తొమ్మిది పూర్ణాలను, ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పిస్తారు. పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుగా భావిస్తారు. స్త్రీకి మాతృత్వం మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయినంగా ఇవ్వాలని పెద్దలు నిర్ణయించారు. ముత్తయిదువకు శక్తిమేరకు చీర, రవికలను సమర్పించుకుంటారు. తర్వాత ఒక తోరాన్ని తాను ధరించి, మిగిలినవాటిని పిల్లలకు కడతారు. మగపిల్లలకు మొలతాడుకు, ఆడపిల్లలకైతే చేతికి తోరం కడతారు. ఇలా తోరం కట్టడం వల్ల పిల్లలకు బాలారిష్టాలు ఉండవని నమ్మకం.
మన రాష్ట్రంలో పొలాల అమావాస్య సందర్భంగా పోలేరమ్మను పూజించే సంప్రదాయం ఉంది. పోలేరమ్మ అనుగ్రహంతో సంతానం చల్లగా ఉంటుందని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో గోడకు పసుపు, కుంకుమతో అలంకారం చేసి, పత్తి వత్తులను అమర్చి అమ్మవారిగా భావించి పూజిస్తారు. కొంతమంది పసుపు గౌరమ్మను, మరికొంత మంది కంద గౌరమ్మను ఆరాధిస్తారు. ప్రాంతీయ ఆచారాలు ఎలా ఉన్నా.. ఏ రూపంలో పూజించినా కలిగే ఫలితం ఒకటే.
పోల అంటే ఎద్దు అని అర్థం. అంటే పొలాల అమావాస్య పశువులకు చెందిన పండుగ అన్నమాట. జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పనులు మొదలవుతాయి. నాటి నుంచి దాదాపు రెండున్నర నెలలు ఎద్దులకు విశ్రాంతి ఉండదు. అలా పొలం పనుల్లో అలసిపోయిన ఎడ్లకు ఆటవిడుపులా ఈ అమావాస్య నాడు నాగలి, బండి కట్టరు. మన కోసం అవిశ్రాంతంగా కష్టపడిన పశువులకు కృతజ్ఞతగా వాటికి విశ్రాంతినిస్తారు. కడుపు నిండా మేతపెట్టి, పూజిస్తారు. మనకు మేలు చేసిన వాటికి కృతజ్ఞత తెలియజేయడం ఈ పండుగలోని పరమార్థం.
వేముగంటి శుక్తిమతి
9908110937